ఆర్సీబీ మహిళల జట్టు మెంటార్ గా సానియా మీర్జా
- టెన్నిస్ దిగ్గజానికి అరుదైన అవకాశం కల్పించిన ఆర్సీబీ యాజమాన్యం
- ఈ నెలలో టెన్నిస్ కు వీడ్కోలు పలకనున్న సానియా
- మార్చి 4 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్
టెన్నిస్ లో ఎన్నో శిఖరాలు అధిరోహించిన సానియాను గౌరవిస్తూ, ఆర్సీబీ ఆమెను మెంటార్ గా నియమించినట్టు తెలుస్తోంది. మెంటార్గా తన కొత్త పాత్రపై మీర్జా స్పందించింది. ‘ఆర్సీబీ మహిళల జట్టులో మెంటార్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. విమెన్స్ ప్రీమియర్ లీగ్తో భారత మహిళల క్రికెట్ ఎంతో మార్పును చూడబోతోంది. ఇందులో భాగం కావాలని నేను ఎదురు చూస్తున్నా. ఆర్సీబీ చాలా సంవత్సరాలుగా ఐపీఎల్లో జనాదరణ పొందిన జట్టు. చాలా మంది ఇష్టపడే జట్టు. ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం మహిళల ప్రీమియర్ లీగ్ కోసం ఒక జట్టును నిర్మించడాన్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది దేశంలో మహిళల క్రీడలను కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఆడపిల్లలు, యువతులు క్రీడలను కెరీర్ గా ఎంచుకునేలా చేస్తుంది’ అని ఆర్సీబీ విడుదల చేసిన వీడియోలో సానియా అభిప్రాయపడింది.
కాగా, ఇటీవల జరిగిన క్రికెటర్ల వేలంలో ఆర్సీబీ స్మృతి మంధాన సహా పలువురు స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ, ఇంగ్లండ్ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హీథర్ నైట్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ తదితరులు ఉన్నారు. మంధాన రూ. 3.4 కోట్లతో వేలంలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. కాగా, డబ్ల్యూపీఎల్ మార్చి 4న మొదలవనుంది.