WPL: మహిళా క్రికెటర్లపై కోట్లు కురిసే సమయం.. నేడే డబ్ల్యూపీఎల్‌ వేలం!

  • ఐదు జట్లలో 90 స్థానాలకు బరిలో 409 మంది
  • స్మృతి, హర్మన్‌, షెఫాలీ రూ. కోటిపైనే పలికే అవకాశం
  • మ. 2.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Inaugural WPL auction set to break new ground for womens cricket

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మరో కీలక అంకానికి రంగం సిద్ధమైంది. డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌ కోసం క్రికెటర్ల వేలం ఈ రోజు ముంబైలో జరగనుంది. ఐదు ఫ్రాంచైజీల్లో అందుబాటులో ఉన్న 90 ఖాళీల కోసం 409 మంది క్రికెటర్లు వేలంలోకి వస్తున్నారు. వీరిలో భారత మహిళల జట్టు స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, షెఫాలీ వర్మ లపై కోట్లు కురిసే అవకాశం ఉంది. విదేశీ క్రీడాకారులు అలీసా హీలీ, బెత్‌ మూనీ, ఎలైస్‌ పెర్రీ, నటాలీ సివర్, మేగన్‌ షుట్‌, దియేంద్ర డాటిన్‌ తదితరులు కూడా భారీ ధర పలకొచ్చు. 

తొలి సీజన్లో పోటీ పడుతున్న ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్‌సీబీ, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ ఫ్రాంచైచీలు వేలం కోసం ఒక్కోటి రూ. 12 కోట్లు ఖర్చు చేయనున్నాయి. అన్ని జట్లకు కలిపి వేలంలో రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ప్రతీ జట్టు గరిష్ఠంగా 18 మందిని కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీయులు ఉండాలి. వేలంలో కనీసం 15 మందిని అయినా తీసుకోవాల్సి ఉంటుంది.

వేలంలో క్రికెటర్లు ఐదు ప్రాథమిక ధరల్లో ( రూ. 10, 20, 30, 40, 50 లక్షలు) రిజిస్టర్ అయ్యారు. రూ. 50 లక్షల కేటగిరీలో మంధాన, హర్మన్‌ సహా 24 మంది ఉన్నారు. తొలి ఎడిషన్‌ కావడంతో ముందుగా స్టార్‌ ప్లేయర్లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే చాన్సుంది. భారత జట్టులో స్మృతి, హర్మన్‌, షెఫాలీతో పాటు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రూ. కోటి నుంచి రెండు కోట్ల వరకూ పలకొచ్చు.

More Telugu News