India: ప్రపంచ కప్​ లో పాకిస్థాన్ తో భారత్​ మ్యాచ్​ నేడే.. కీలక ప్లేయర్​ దూరం

  • దాయాది దేశాల మహిళల జట్ల మధ్య అమీతుమీ
  • సాయంత్రం గం. 6.30 నుంచి మ్యాచ్ 
  • స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం
Womens T20 World Cup 2023 India vs Pakistan  today

క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య జట్ల మ్యాచ్ అంటే ఎక్కడాలేని ఆసక్తి కలుగుతుంది. అందునా ప్రపంచ కప్ లో దాయాది దేశాల మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉద్వేగాలు తారాస్థాయికి చేరుకుంటాయి. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు ఈ రోజు తలపడుతున్నాయి. టోర్నీలో దాయాది జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. చాలా ఏళ్లుగా పోరాడుతున్నా.. వరల్డ్‌ ‌కప్‌‌ గెలవలేకపోతున్న భారత అమ్మాయిలు ఈసారి ఎలాగైనా కప్పుతోనే తిరిగి రావాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్‌‌-బి తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించి టోర్నీని ఘన విజయంతో ఆరంభించాలని చూస్తున్నారు.

బలమైన జట్టుగా దిగుతున్న భారతే ఈ మ్యాచ్‌‌లో ఫేవరెట్‌‌గా కనిపిస్తున్నది. అయితే భుజం గాయంతో కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌, చేతి వేలి గాయంతో స్మృతి మంధాన ఇబ్బందిపడుతున్నారు. ఈ మ్యాచ్ కు మంధాన అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. కొన్ని రోజుల కిందట ఇదే దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్19 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యులు షెఫాలీ, రిచా ఘోష్‌‌ ఈ మ్యాచ్‌‌లో కీలకం కానున్నారు. ఈ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ చానెల్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

More Telugu News