దేశాభివృద్ధి భారాన్ని దేవుడిపై వేసిన పాక్ మంత్రి
- అల్లా యే చూసుకుంటాడన్న ఆర్థిక మంత్రి ఇషాక్ దార్
- ఇస్లాం పేరుమీద ఏర్పడ్డ ఒకే ఒక దేశం తమదేనని వ్యాఖ్య
- ప్రధాని షరీఫ్ నాయకత్వంలో తాము చేయగలిగిందంతా చేస్తున్నామని వెల్లడి
ఇస్లామాబాద్ లో శుక్రవారం గ్రీన్ లేన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సర్వీసును మంత్రి ఇషాక్ దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి కారణం గత ప్రభుత్వ నిర్ణయాలేనని చెప్పారు. నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్న కాలం (2013-2017) లో పాక్ ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా ఉండేదని తెలిపారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.
ఆ నిర్ణయాల వల్ల ఏర్పడిన ఇబ్బందులను ఇప్పుడు ఒక్కొక్కటిగా తీరుస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో రాత్రీపగలూ కష్టపడుతున్నామని పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ హయాంలో అభివృద్ధి వైపు నడిచిన దేశం ఇప్పుడు పట్టాలు తప్పిందని ఇషాక్ దార్ ఆరోపించారు. అప్పట్లో పాకిస్థాన్ స్టాక్ ఎక్ఛేంజ్ దక్షిణాసియాలోనే బెస్ట్ ఎక్ఛేంజ్ గా ఉండేదని, 5వ ర్యాంకు సాధించిందని మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలు ఇప్పుడు కళ్లారా చూస్తున్నారని పేర్కొంటూ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనను విమర్శించారు.