Madhya Pradesh: కిడ్నాపర్లకు రూ. 15 లక్షలు చెల్లించేందుకు.. చందాలు వేసుకుంటున్న గ్రామస్థులు

  • మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లో ఘటన
  • ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసిన దోపిడీ ముఠా
  • అడిగినంత చెల్లిస్తేనే విడిచిపెడతామంటున్న నేరగాళ్లు
  • తలా కొంత చందాలు వేసుకుంటున్న గ్రామస్థులు
  • కిడ్నాపర్ల కోసం రంగంలోకి దిగిన పోలీసులు
Miscreants kidnap 3 people who went to graze cattle in Sheopur forest Madhyapradesh

ఓ నేరస్తుల ముఠా కిడ్నాప్ చేసిన తమవారిని విడిపించుకునేందుకు ఊరంతా ఏకమైంది. కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మొత్తం కోసం గ్రామస్థులు తలా ఇంత చందా వేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రామ్‌ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. వారి కోసం ఆరా తీస్తున్న క్రమంలో రాజస్థాన్‌లోని ఓ ముఠా వారిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.

వారిని సంప్రదిస్తే రూ. 15 లక్షలు చెల్లిస్తే వారిని విడిచిపెడతామని చెప్పారు. ఆ మాట విన్న బాధిత కుటుంబాలు షాకయ్యారు. వారంతా పేదలు కావడంతో అంత సొమ్ము ఎక్కడి నుంచి తీసుకురావాలో వారికి అర్థం కాలేదు. విషయం తెలిసిన గ్రామస్థులు రంగంలోకి దిగారు.

గ్రామమంతా చందాలు వేసుకుని కిడ్నాపర్ల బారి నుంచి తమ వారిని విడిపించుకోవాలని నిర్ణయించారు. గ్రామంలోని అందరూ పేదలేనని, వారిలో ఎక్కువమంది పశువుల పోషకులేనని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. కిడ్నాప్ అయిన ఓ వ్యక్తి ఇంటికి పైకప్పు కూడా లేదని అన్నారు. అలాంటి స్థితిలో ఉన్న ఆ కుటుంబాలు రూ. 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలవని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. గ్రామస్థులందరం కలిసి కిడ్నాపర్లు అడిగిన మొత్తాన్ని చందాల ద్వారా కూడబెడుతున్నట్టు చెప్పారు. 

విషయం తెలిసిన మధ్యప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు. రాజస్థాన్ పోలీసులతో కలిసి కిడ్నాపర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కిడ్నాపర్ల ఆచూకీ చెప్పిన వారికి తొలుత ప్రకటించిన రూ. 10 వేల రివార్డును ఇప్పుడు రూ. 30 వేలకు పెంచారు. కాగా, కొన్ని నెలల క్రితం కూడా ష్యోపూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాకు చెందిన ఓ రైతును దోపిడీ ముఠా కిడ్నాప్ చేసింది. డబ్బులు చెల్లించిన అనంతరం విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో దోపిడీ ముఠాల ప్రాబల్యం ఎక్కువ కావడంతో ఇక్కడ ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి.

More Telugu News