Rishabh Pant: ఘోర రోడ్డు ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ క్రికెటర్ రిషభ్ పంత్.. పూర్తిగా దగ్ధమైన కారు

  • ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం
  • డివైడర్ ను ఢీకొన్న మెర్సిడెస్ బెంజ్ కారు
  • స్వయంగా డ్రైవ్ చేస్తున్న పంత్
Rishabh Pant met with car accident

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తన మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో కారును స్వయంగా పంత్ డ్రైవ్ చేస్తున్నాడు. ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులో పంత్ మాత్రమే ఉన్నాడని ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయని... ఈ క్రమంలో, కారు అద్దాలను పగులగొట్టి, వాహనం నుంచి పంత్ బయటకు వచ్చారని వెల్లడించారు. 

ఈ ప్రమాదంలో పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలింది. కాలికి ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆయనను రూర్కీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక క్షణం నిద్రలోకి జారుకోవడం వల్లే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. పంత్ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెట్ సహచరులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

More Telugu News