Atchannaidu: జగన్ సామాజికవర్గానికే పెద్దపీట.. మిగిలిన వారికి కత్తిపీట: అచ్చెన్నాయుడు

  • పదవుల్లో సొంత సామాజికవర్గానికే పెద్దపీట వేస్తున్నారు
  • బడ్జెట్ లో సైతం ఇతరులకు అన్యాయం జరుగుతోంది
  • సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి
Atchannaidu fires on Jagan

ముఖ్యమంత్రి జగన్ తన సామాజికవర్గానికే పెద్దపీట వేస్తున్నారని... మిగిలిన వారికి కత్తిపీట వేస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత వారిని వదిలేశారని విమర్శించారు. పదవుల పంపకంలో ఆయన సామాజికవర్గానికే పెద్ద వేస్తున్నారని... బడ్జెట్ లో సైతం ఇతర సామాజికవర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. జనాభాలో 5.53 శాతం ఉన్న గిరిజనుల పింఛన్లకు రూ. 971 కోట్లు కేటాయించిన జగన్ తన సామాజికవర్గానికి చెందిన రెడ్డి కార్పొరేషన్ కు రూ. 1,555 కోట్లు కేటాయించారు. 

దామాషా ప్రకారం 17.08 శాతం ఉన్న ఎస్సీలకు రూ. 7 వేల కోట్లు, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రూ. 16 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా... ఎస్సీలకు రూ. 3 వేల కోట్లు, బీసీలకు రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని కులాలను సమానంగా ఆదరించాలని... కానీ, జగన్ ఆయన సామాజికవర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

More Telugu News