Shashi Tharoor: కాలికి గాయంతో వీల్ చెయిర్లోనే పార్లమెంటుకు వచ్చిన శశి థరూర్

  • ఇటీవల పార్లమెంటులో జారిపడిన శశి థరూర్
  • కాలికి గాయం.. కొన్నిరోజుల విశ్రాంతి
  • కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు
  • పీఏల సాయంతో లోక్ సభకు వచ్చిన థరూర్
Shashi Tharoor enters into parliament in wheel chair

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల పార్లమెంటు భవనంలో మెట్లు దిగుతూ జారిపడడం తెలిసిందే. దాంతో ఆయన కాలు బెణికింది. వైద్యుల సలహాపై కొన్నిరోజులు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతుండడంతో ఇవాళ ఆయన లోక్ సభకు వీల్ చెయిర్లో వచ్చారు. తన వ్యక్తిగత సహాయకులు వెంటరాగా, లోక్ సభలో ప్రత్యేక ద్వారం నుంచి లోపలికి ప్రవేశించారు. దీనిపై థరూర్ ట్విట్టర్ లో వెల్లడించారు. 

పార్లమెంటులోకి వీల్ చెయిర్ తో రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని, అది డోర్ నెం.9 అని తెలిపారు. "మొత్తమ్మీద నా సిబ్బంది సాయంతో ఓ నాలుగు నిమిషాల పాటు లోక్ సభలో నా పర్యటన చక్కగా సాగింది. ఈ తాత్కాలిక వైకల్యం ద్వారా నాకో విషయం బోధపడింది... వైకల్యాలతో బాధపడేవారి కోసం మన వద్ద పేలవరీతిలో సదుపాయాలు ఉన్నాయన్న విషయం అర్థమైంది" అని వివరించారు. ఈ మేరకు తాను వీల్ చెయిర్లో ఉన్నప్పటి ఫొటోను కూడా శశి థరూర్ పంచుకున్నారు.

More Telugu News