ప్రియుడితో విభేదాలు.. చంపి డ్రమ్ములో తీసుకెళ్లి తగలబెట్టేసింది!

Girl friend killed boy friend and set fire in Chhattisgarh
  • డబ్బుల విషయంలో ప్రేయసీప్రియుల మధ్య విభేదాలు
  • బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో స్నేహితుడితో కలిసి చంపేసిన ప్రియురాలు
  • చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో ఘటన
డబ్బుల విషయంలో తలెత్తిన విభేదాలు ప్రియుడి హత్యకు కారణమయ్యాయి. స్నేహితుడితో కలిసి ప్రియుడిని చంపేసిన ప్రియురాలు ఆపై మృతదేహాన్ని ఓ డ్రమ్ములో పెట్టి అడవికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేసింది. గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జరిగింది. చంద్రభూషణ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కోట్నా పానీ అడవుల్లో రెండు రోజుల క్రితం సగం కాలిన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అది చంద్రభూషణ్‌దేనని గుర్తించారు.

దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడి ప్రియురాలు రాగిణి సాహును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. చంద్రభూషణ్-రాగిణి ప్రేమికులు. ఈ క్రమంలో రాగిణికి ప్రియుడు కొంతమొత్తం అప్పు ఇచ్చాడు. ఈ డబ్బు విషయంలో ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం ప్రియురాలిని చంద్రభూషణ్ బ్లాక్‌మెయిల్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ప్రియుడిపై పగ పెంచుకున్న రాగిణి తన స్నేహితుడైన నూతన సాహుతో కలిసి చంద్రభూషణ్‌ను హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి సమీపంలోని అడవికి తీసుకెళ్లి తగలబెట్టేసింది. దీంతో పోలీసులు రాగిణి, ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
Go Back to Shorts
Chhattisgarh
Rajnandgaon
Crime News

More Telugu News