Raja Singh: బుల్లెట్ తూటాలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధమే: రాజాసింగ్

  • రాజాసింగ్ పై మరో కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఒవైసీ సోదరులపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్న రాజాసింగ్
  • ప్రాణం పోయేంత వరకు రామనామ జపం చేస్తుంటానని వ్యాఖ్య
Will do Ram Nama japam till my last breath says Raja Singh

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన అయోధ్యపై ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. దీంతో, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వివరణ ఇవ్వాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను ఎత్తేస్తూ హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ నోటీసులకు ఆయన తరపు లాయర్ సంజాయషీ ఇచ్చారు. అయితే సంజాయషీలో పేర్కొన్న అంశాలు సంతృప్తికరంగా లేవంటూ.. రాజాసింగ్ పై ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదు చేశారు. 

మరోవైపు తనపై పోలీసులు మరో కేసు నమోదు చేయడంపై రాజాసింగ్ స్పందించారు. బాబ్రీమసీదుపై ఒవైసీ సోదరులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని... వాళ్లపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, ఒవైసీ సోదరుల మెప్పు పొందేందుకు పోలీసులు యత్నిస్తున్నారని విమర్శించారు. వారి మెప్పు కోసం తనపై పోటీలు పడి కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ప్రాణం పోయేంత వరకు తాను రామనామ జపం చేస్తూనే ఉంటానని చెప్పారు. హిందూ సిద్ధాంతం కోసం బుల్లెట్ తూటాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమేనని అన్నారు.

More Telugu News