మనం ఉన్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యం: సీఎం కేసీఆర్

CM KCR speech in Mahaboobnagar
  • మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
  • టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, కలెక్టరేట్ భవనాలకు ప్రారంభోత్సవం
  • బడ్జెట్ ను రూ.3 లక్షల కోట్లకు తీసుకు వచ్చామని వెల్లడి
  • సంక్షేమ కార్యక్రమాలు ఘనంగా అమలు చేస్తున్నట్టు వివరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్ భవనాలను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించడం ఆనందదాయకం అని అన్నారు. గతంలో పాలమూరు జిల్లాలో వేదనలు, రోదనలు వినిపించేవని, ఇప్పుడు జిల్లాలో సంతోషం నెలకొందని తెలిపారు. 

రాష్ట్రంలో ఏడేళ్ల కిందట రూ.60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని తెలిపారు. ఇప్పుడు బడ్జెట్ విలువ రూ.3 లక్షల కోట్లకు తీసుకువచ్చామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో మనకు సాటి ఎవరూ లేరు అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

గతంలో భయంకరమైన రీతిలో విద్యుత్ సమస్యలు ఉండేవి, ఇప్పుడా బాధ లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏవిధంగా ఉండాలని కోరుకున్నామో, ఇప్పుడదే బాటలో ఉన్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మనం ఉన్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యమని, జీవితానికి అదే పెద్ద పెట్టుబడి, సంతృప్తి అని వివరించారు. 

ఇక, రాష్ట్రంలో గురుకులాలను మూడు నాలుగు రెట్లు పెంచుతామని అన్నారు. కంటి వెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చామని, కంటి వెలుగు ఓట్ల కోసం తెచ్చిన కార్యక్రమం కాదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తీసుకువచ్చినా దాని వెనుక ఎంతో ఆలోచన ఉంటుందని పేర్కొన్నారు. సంస్కరణ అనేది కొనసాగుతూనే ఉంటుందని వివరించారు.
Go Back to Shorts
KCR
Mahaboobnagar
TRS
Telangana

More Telugu News