K.S.Jawahar Reddy: ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి?

  • ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మ
  • జవహర్‌రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ నేడు ఉత్తర్వులు?
  • జూన్ 2024తో ముగియనున్న జవహర్‌రెడ్డి సర్వీసు
  • సీఎస్‌గా ఏడాదిన్నర మాత్రమే కొనసాగే అవకాశం
Andhrapradesh Next CS Would Be Jawahar Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ ‌రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే డిసెంబరు 1 నుంచి ఆయన కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన సర్వీసు జూన్ 2024తో ముగియనున్న నేపథ్యంలో సీఎస్‌గా ఆయన కొనసాగేది ఏడాదిన్నర మాత్రమే.

ఇక, సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మకు కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్‌లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ చైర్మన్ ‌గానూ ఆయనను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక, జవహర్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తొలి నుంచీ జగన్ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో టీటీడీ ఈవోగా నియమించారు. అక్కడ ఉండగానే సీఎంవోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు రెండు బాధ్యతలన్ని నిర్వర్తించారు. ప్రస్తుతం సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన సీఎంవో వ్యవహారాలన్నింటినీ చూసుకుంటున్నారు.

More Telugu News