Bihar: బీహార్​ లో విషాదం.. 12 మందిని చిదిమేసిన ట్రక్కు

  • రహదారి పక్కన గుడి వద్ద భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు
  • మృతుల్లో నలుగురు చిన్నారులు
  • రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
12 killed as speeding truck rams into crowd in Bihar Vaishali

బీహార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. వైశాలి జిల్లా మెహనార్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ ట్రక్కు రహదారి పక్కన ఉన్న గుడి వద్ద పూజలు చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లడంతో నలుగురు చిన్నారులు సహా 12 మంది మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. 

ఈ ఘటనపై  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

మరోపైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాద ఘటనపై  విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బీహార్ ఉప మఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ట్రక్కు డ్రైవర్‌, సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం తాగి నడుపుతున్నాడా? అనే విషయాన్ని వైద్య పరీక్షల తర్వాతే తేలుతుందని పోలీసులు చెప్పారు.

More Telugu News