Mysore palace: వర్షాలకు కూలిన మైసూర్ ప్యాలెస్ ప్రహరీ

  • కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రాంతం
  • విదేశీయులు కూడా బాగా ఇష్టపడే ప్లేస్
  • కోట గోడకు అనుబంధంగా నిర్మించిన ప్రహరీ కూలింది
  • పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికుల ఆరోపణలు
mysore palace compound wall collapsed due to rains

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ప్రముఖ పర్యాటక ప్రాంతం మైసూర్ ప్యాలెస్ ప్రహరీ కొంతభాగం కూలిపోయింది. మైసూరు జిల్లాలో నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాన నీటిలో నానడం వల్ల అంబావిలాస్‌ ప్యాలెస్‌ ప్రహరీ కూలిపోయింది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం కనీస పర్యవేక్షణ చేయలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే కోట గోడ కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

శత్రువుల నుంచి రక్షణ కోసం మారెమ్మ ఆలయం, జయమార్తాండ ప్రధాన ద్వారాల మధ్య మైసూరు మహారాజు ఈ గోడను నిర్మించారు. వందల సంవత్సరాల క్రితం కట్టిన మైసూరు ప్యాలెస్ చూడడానికి ఏటా వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి ప్యాలెస్ ను చూడడానికే ప్రత్యేకంగా వచ్చే పర్యాటకులు కూడా ఉన్నారు.

పురావస్తు శాఖ నిపుణుల పరిశీలన
ప్యాలెస్ ప్రహరీ కూలిన ప్రాంతాన్ని నిపుణులతో కలిసి పురావస్తుశాఖ అధికారులు పరిశీలించారు. కోట గోడలకు మరమ్మతులు చేయాలని తేల్చారు. గోడలకు అక్కడక్కడా ఏర్పడిన పగుళ్లను పరిశీలించారు. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంబా ప్యాలెస్ ను సంరక్షించేందుకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని మైసూరుకు చెందిన పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

More Telugu News