Mohan Babu: 'మా' ఎన్నికల్లో విష్ణు ఓడిపోవాలని కోరుకున్నవారు కూడా బాగుండాలి: మోహన్ బాబు

  • 'మా' అధ్యక్షుడిగా ఏడాది కాలం పూర్తిచేసుకున్న మంచు విష్ణు 
  • హైదరాబాదులో ప్రెస్ మీట్
  • హాజరైన మోహన్ బాబు, మంచు విష్ణు
  • విష్ణు చేసే పనుల్లో మోసం, దగా లేవన్న మోహన్ బాబు
Mohan Babu press meet

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏడాదికాలం పూర్తిచేసుకున్న సందర్భంగా మోహన్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మా' సభ్యులందరికీ షిరిడీ సాయి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. 'మా' ఎన్నికల్లో విష్ణు ఓడిపోవాలని కోరుకున్నవారు కూడా బాగుండాలని వ్యాఖ్యానించారు. 

తాను గతంలో 'మా' అధ్యక్షుడిగా వ్యవహరించానని, అయితే ఎప్పుడూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయలేదని మోహన్ బాబు చెప్పారు. అయితే, చేసిన మంచి పనుల గురించి చెప్పుకోవడంలో తప్పేమీలేదని, అంతమాత్రాన అది సొంత డబ్బా కొట్టుకోవడం కాదని స్పష్టం చేశారు. విష్ణు చేసే పనుల్లో మోసం, దగా లేవని అన్నారు.

కాగా, ఈ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, తాను ఒక్క 'మా'కు మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు కూడా జవాబుదారీనే అని వెల్లడించారు. తాము ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం నెరవేర్చామని తెలిపారు. ఇక ఫిలిం చాంబర్ భవనాన్ని కూల్చి, కొత్త భవనం నిర్మించేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని మంచు విష్ణు వెల్లడించారు. 

అంతేకాదు, 'మా'కు వ్యతిరేకంగా కార్యవర్గ సభ్యులు కానీ, నటులు కానీ ధర్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామని చెప్పారు. 'మా'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

More Telugu News