బంగారం త్వరలో రూ.1.93 లక్షలకు!

Gold price soon to reach 193 lakh rupees
  • మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదికలో వెల్లడి
  • యుద్ధాల కన్నా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లే ధరలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషణ
  • అంతర్జాతీయంగా ఔన్సు పసిడి 5,500 డాలర్లకు చేరొచ్చని అంచనా
బంగారం ధర రానున్న రోజుల్లో భారీగా పెరగనుంది. 10 గ్రాముల పసిడి ఏకంగా రూ.1.93 లక్షల స్థాయికి చేరొచ్చని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంవోఎఫ్ఎస్ఎల్) అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల సరళిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, భవిష్యత్తులో ధరలు కొత్త గరిష్ఠాలను తాకవచ్చని తన తాజా నివేదికలో వెల్లడించింది.

ఇటీవలి కాలంలో పసిడి ధరల పెరుగుదలకు కేవలం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మాత్రమే కారణం కాదని, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. యుద్ధాలు, అంతర్జాతీయ వివాదాల కంటే కూడా.. అవి వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశానికే ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషించింది.

భవిష్యత్తులో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఇచ్చే సంకేతాలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి వచ్చే పెట్టుబడులు ధరలను నిర్దేశిస్తాయని పేర్కొంది. "స్వల్పకాలంలో ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించినా, దీర్ఘకాలంలో సంస్థాగత డిమాండ్ మార్కెట్‌కు బలమైన మద్దతు ఇస్తుంది" అని మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీ విశ్లేషకులు మానవ్ మోడీ తెలిపారు.

నివేదిక ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,800 డాలర్లకు, రానున్న 12-15 నెలల్లో 5,500 డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర మధ్యకాలంలో రూ.1.68 లక్షలకు, ఆ తర్వాత 12-15 నెలల వ్యవధిలో రూ.1.93 లక్షల గరిష్ఠ స్థాయికి చేరవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. మధ్యలో స్వల్పంగా 6 నుంచి 8 శాతం ధర తగ్గినా, తిరిగి పుంజుకుని భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Advertisement
Motilal Oswal
Gold Price Prediction
Gold Rate Hike
Investment Tips
Commodity Market
Gold Price 1.93 Lakh

More Telugu News