ఖర్గేతో పోల్చితే నా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు: సొంత పార్టీపై శశిథరూర్ అసంతృప్తి

Shashi Tharoor disappoints on Congress leaders
  • ఈ నెల 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
  • బరిలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్
  • ప్రచారంలో పీసీసీ చీఫ్ లు సహకరించడంలేదన్న థరూర్
  • ఓటర్ల లిస్టు అసంపూర్తిగా ఉందని వెల్లడి
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 19న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో, శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో తన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మల్లికార్జున ఖర్గేతో పోల్చితే పార్టీలో తనకు అందుతున్న సహకారం ఏమంత సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. 

తాను ప్రచారం కోసం రాష్ట్రాలకు వెళితే, అక్కడి పీసీసీ చీఫ్ లు మొహం చాటేస్తున్నారని వెల్లడించారు. మల్లికార్జున ఖర్గే ఏ రాష్ట్రానికైనా వెళితే అక్కడి పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత స్వయంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారని, ఆయన చెంతనే కూర్చుని, ఇతర నేతలను కూడా రావాలని ఆహ్వానిస్తున్నారని థరూర్ వివరించారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో ఒక్కరికే ఈ తరహా మర్యాదలు దక్కుతున్నాయని, తాను వెళితే ఎవరూ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళితే, అక్కడ పీసీసీ చీఫ్ అందుబాటులో లేకుండా పోయాడని పేర్కొన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేసే సభ్యుల జాబితాను అందజేయడంలోనూ వివక్ష కనిపిస్తోందని, తనకు ఇంతవరకు పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను అందించలేదని అసంతృప్తి వెలిబుచ్చారు. ఓ లిస్టు అందజేస్తే అందులో ఫోన్ నెంబర్లు లేవని, ఫోన్ నెంబర్లు లేకుండా తాను వారితో ఎలా మాట్లాడగలనని శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని తాను అనడంలేదని, 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతుండడంతో కొన్ని లోపాలు చోటుచేసుకుంటున్నాయని థరూర్ అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Shashi Tharoor
Mallikharjuna Kharge
Congress
President
Elections

More Telugu News