Health: ఈ ఐదు పండ్లతో డీహైడ్రేషన్​ కు దూరం.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్న నిపుణులు

  • రోజూ శరీరానికి తగినంతగా నీరు అందాల్సిందేనని చెబుతున్న నిపుణులు
  • పలు రకాల పండ్లతో తగినన్ని నీళ్లు, పోషకాలు అందుతాయని వెల్లడి
  • కొన్నిరకాల పండ్లు పొద్దున.. మరికొన్ని మధ్యాహ్నం తీసుకోవాలని సూచనలు
five fruits to add to your diet to stay hydrated

మన శరీరంలో 70 శాతానికిపైగా ఉండేది నీరేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. శరీరంలోని ప్రతికణానికి నీటి అవసరం ఉంటుంది. శరీరంలో అవయవాలను శుభ్రంగా ఉంచడానికి, చెడు పదార్థాలను బయటికి పంపడానికి తగినంత నీరు కావాల్సిందే. అందువల్ల ఎప్పటికప్పుడు, అవసరానికి తగినట్టుగా నీరు అందాల్సిందే. లేకుంటే శరీరంలో డీహైడ్రేషన్‌ పరిస్థితి ఏర్పడి... జీవక్రియలు దారి తప్పుతాయి. ఈ క్రమంలో నేరుగా నీరు తాగడంతోపాటు ఆహారం ద్వారా కూడా నీరు అందేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అటు తగినంత నీటిని అందిస్తూనే... ఇటు ఆరోగ్యానికి కూడా తోడ్పడేలా ఐదు రకాల పండ్లు తోడ్పడుతాయని వివరిస్తున్నారు.

1. యాపిల్స్‌ 
యాపిల్స్‌ లో 86 శాతం వరకు నీరే ఉంటుందని, వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి నీరు అందుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి, గుండె ఆరోగ్యం బాగుండటానికి తోడ్పడుతుందని తెలిపారు. రోజూ పొద్దున బ్రేక్‌ ఫాస్ట్‌ గా గానీ, సాయంత్రం స్నాక్స్‌గా గానీ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

2. పుచ్చకాయ 
మనకు నీటిని, తగినంత పోషకాలను అందించే అత్యుత్తమ పండ్లలో పుచ్చకాయ కీలకమైనది. పుచ్చకాయల్లో 96 శాతం మేర నీరే ఉంటుందని, దానికితోడు విటమిన్‌ ఏ, విటమిన్‌ సి లతోపాటు ఇతర పోషకాలూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నీటిశాతం ఎక్కువగా ఉండటం, దీని నుంచి అందే కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి పుచ్చకాయ బాగా ఉపకరిస్తుందని వివరిస్తున్నారు. పుచ్చకాయలను రోజులో ఏ సమయంలో తీసుకున్నా మంచిదేనని సూచిస్తున్నారు.

3. బొప్పాయి పండు 
నీరు, పోషకాల శాతం ఎక్కువగా ఉండే మరో మంచి పండు బొప్పాయి అని, దీనిలో 88 శాతం నీరు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనితోపాటు విటమిన్‌ సీ, విటమిన్‌ ఏ, విటమిన్‌ ఈ , యాంటీ ఆక్సిడాంట్లు ఉంటాయని... బొప్పాయి తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందని వివరిస్తున్నారు. బొప్పాయిని విడిగాగానీ, ఫ్రూట్‌ సలాడ్‌ రూపంలోగానీ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

4. నారింజ 
అటు ఆరోగ్యం, ఇటు శరీరానికి హైడ్రేషన్‌ అందించే పండ్లలో నారింజ ఒకటని నిపుణులు వివరిస్తున్నారు. విటమిన్‌ సి, పొటాషియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే నారింజతో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుందని.. చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా మారుతుందని చెబుతున్నారు. వీలైతే మధ్యాహ్నం పూట నేరుగా గానీ, జ్యూస్‌ రూపంలోగానీ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

5. స్ట్రాబెర్రీలు 

స్ట్రాబెర్రీలలో 91 శాతం నీరే ఉంటుందని.. ఈ పండ్లలో ఫైబర్‌, మాంగనీస్‌, విటమిన్‌ సి, ఫోలేట్‌ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల మంచి జీర్ణశక్తికి తోడ్పడుతాయని, ఇతర పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అంటున్నారు. స్ట్రాబెర్రీలను సలాడ్లుగా గానీ, జ్యూస్‌ గా గానీ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

నీరు తాగడం తప్పనిసరి
మనం తీసుకునే ఆహారం ద్వారా ఎంతగా నీరు అందినా... నేరుగా నీరు తాగడం కూడా తప్పనిసరి అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనిషి వయసు, బరువును, నివసించే ప్రాంతాన్ని బట్టి రోజు కనీసం రెండు లీటర్ల నుంచి మూడు లీటర్ల వరకు నీరు అవసరమని చెప్తున్నారు. తగిన స్థాయిలో నీళ్లు అందితే... శరీరం నుంచి చెడు పదార్థాలు బయటికి వెళ్లి ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News