Pritbha: కాబోయే భార్య నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో పోస్టు చేసిన డాక్టర్... స్నేహితులతో కలిసి కసితీరా కొట్టిన యువతి.. ఆసుపత్రిలో మృతి

  • బెంగళూరులో ఘటన
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన యువ డాక్టర్
  • మూడ్రోజుల తర్వాత మృతి
  • లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు
  • కాబోయే భార్యే అసలు నిందితురాలు అని గుర్తింపు
Woman killed fiancee after he posted her nude pics in social media

బెంగళూరులో వారం కిందట వికాస్ రాజన్ అనే యువ డాక్టర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు. కోమాలోకి వెళ్లిన అతడు, మూడ్రోజుల అనంతరం ప్రాణాలు విడిచాడు. అతడి శరీరంపై బలమైన దెబ్బలు కనిపిస్తుండడంతో పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసే సరికి అసలు విషయాలు వెల్లడయ్యాయి.

వికాస్ రాజన్ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. చెన్నైలో ఓ ఆసుపత్రిలో కొంతకాలంగా పనిచేశాడు. అనంతరం బెంగళూరు వచ్చి, విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడాన్ని ఉపాధిగా ఎంచుకున్నాడు.

రెండేళ్ల కిందట డాక్టర్ వికాస్ రాజన్ కు ప్రతిభ అనే ఆర్కిటెక్ట్ సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఇద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. 

అయితే, ఇటీవల తన నగ్న చిత్రాలు ఇన్ స్టాగ్రామ్ లో చూసి ప్రతిభ దిగ్భ్రాంతికి గురైంది. దాంతో వికాస్ రాజన్ ను నిలదీసేసరికి అతడు అసలు విషయం చెప్పాడు. ఓ ఫేక్ ఐడీ రూపొందించి, కేవలం సరదా కోసమే ఆ నగ్న ఫొటోలు పోస్టు చేశానని తెలిపాడు. 

దాంతో అతడిపై తీవ్ర ఆగ్రహం చెందిన ప్రతిభ... ఓ పార్టీ ఉందంటూ తన స్నేహితుల వద్దకు తీసుకెళ్లింది. అక్కడ మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రతిభ, ఆమె స్నేహితులు డాక్టర్ వికాస్ రాజన్ పై దాడి చేశారు. ఇల్లు తుడిచే కర్రతో గట్టిగా కొట్టారు. 

తీవ్ర గాయాలపాలైన అతడిని ప్రతిభ ఆసుపత్రికి తరలించింది. ఓ దాడిలో రాజన్ గాయపడ్డాడని ఆ యువ డాక్టర్ సోదరుడు విజయ్ కి చెప్పింది. ఆ ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఎక్కడా తన పాత్ర ఉందన్న విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. 

అయితే, పోలీసులు మరింత నిశితంగా దర్యాప్తు చేయగా, అసలు నిందితురాలు ప్రతిభేనని తేలింది. ఆమెను, ఆమెకు సహకరించిన గౌతమ్, సుశీల్, సునీల్ అనే ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చగా, జ్యుడిషియల్ కస్టడీ విధించారు.

More Telugu News