Telangana: టీఆర్ఎస్‌, బీజేపీ విధానాల మధ్య తేడాను చెప్పిన తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు

  • అసెంబ్లీలో టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం
  • బీజేపీ వైఖ‌రిపై ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించిన హ‌రీశ్ రావు
  • విఫలం.. విషం.. విద్వేషం.. విధానాన్ని బీజేపీ అవ‌లంబిస్తోంద‌ని ఆరోప‌ణ‌
  • సఫలం.. సంక్షేమం.. సామరస్యం.. విధానాన్ని టీఆర్ఎస్ పాటిస్తోంద‌ని వెల్ల‌డి
  • కేంద్రం త‌న సంప‌ద‌ను మిత్రుల‌కు పంచిపెడుతోంద‌ని విమ‌ర్శ‌
ts minister harish rao fires over bjp

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడీగా జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్‌, విప‌క్ష బీజేపీల మ‌ధ్య స‌భ‌లో మాట‌ల యుద్ధం కొనసాగుతోంది. విప‌క్షాల‌ను.. ప్ర‌త్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విమ‌ర్శించేందుకే ఈ స‌భ‌ను అధికార ప‌క్షం వినియోగిస్తోంద‌ని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించ‌గా... వారి ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ టీఆర్ఎస్ కూడా ప్ర‌తి దాడికి దిగింది. ఈ క్ర‌మంలో మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు మాట్లాడుతూ... టీఆర్ఎస్, బీజేపీల విధానాల‌ను ప్ర‌స్తావించారు. 

విఫలం.. విషం.. విద్వేషం.. విధానాన్ని బీజేపీ అవ‌లంబిస్తోంద‌ని హ‌రీశ్ రావు ఆరోపించారు. అదే స‌మ‌యంలో సఫలం.. సంక్షేమం.. సామరస్యం.. విధానాన్ని టీఆర్ఎస్ పాటిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. గ‌డ‌చిన 8 ఏళ్ల కాలంలో ఈ రెండు పార్టీలు అవలంబించిన విధానాలు ఇవేన‌ని ఆయ‌న చెప్పారు. 

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్రం... బ‌ల‌హీన రాష్ట్రం, బ‌ల‌మైన కేంద్రం అన్న విధానంతో ముందుకు సాగుతోంద‌న్నారు. కేంద్రం ద‌యాదాక్షిణ్యాల మీదే రాష్ట్రాలు ఆధారప‌డాల‌న్న ఆలోచ‌న‌తో కేంద్రం సాగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేంద్రం త‌మ సంప‌ద‌ను త‌న మిత్రుల‌కు పంచి పెడుతోంద‌న్న హ‌రీశ్ రావు... తెలంగాణ మాత్రం పేద‌ల‌కు పంపిణీ చేస్తోంద‌ని ఆయ‌న తెలిపారు.

More Telugu News