Cyrus Mistry: ప్రమాదం జరగడానికి 5 సెకన్ల ముందు బ్రేక్ వేశారు: సైరస్ మిస్త్రీ యాక్సిడెంట్ కేసులో మెర్సిడెస్ బెంజ్ మధ్యంతర నివేదిక

  • రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన మిస్త్రీ, జహంగీర్ పండోల్
  • ప్రమాదానికి ముందు 100 కి.మీ. వేగంతో కారు వెళ్తోందన్న నివేదిక  
  • హాంకాంగ్ నుంచి నిపుణుల బృందం వస్తోందని వెల్లడి
Brek was applied 5 seconds before accident says Mercedes Benz in Cyrus Mistry case

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబైకి మెర్సిడెస్ బెంజ్ కారులో వస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 54 ఏళ్ల మిస్త్రీతో పాటు, ఆయన స్నేహితుడు జహంగీర్ పండోల్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారులోనే ఉన్న అనహితా పండోల్, ఆమె భర్త డేరియస్ పండోల్ కు తీవ్ర గాయాలయ్యాయి. 

మరోవైపు, ప్రమాదానికి ముందు జరిగిన పరిస్థితులను మెర్సిడెస్ బెంజ్ మహారాష్ట్రలోని పాల్ ఘర్ పోలీసులకు నివేదిక రూపంలో అందజేసింది. కారులోని ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ ను విశ్లేషించి వివరాలను తెలుసుకున్నామని నివేదికలో తెలిపింది. ప్రమాదం జరగడానికి ముందు కారు 100 కిలోమీటర్ల వేగంతో ఉందని.... దుర్ఘటనకు 5 సెకన్ల ముందు బ్రేక్ వేశారని పేర్కొంది. డివైడర్ ను ఢీకొన్నప్పుడు కారు వేగం 89 కి.మీ అని తెలిపింది. మెర్సిడెస్ బెంజ్ కు చెందిన నిపుణుల బృందం సోమవారం హాంకాంగ్ నుంచి ముంబైకి చేరుకుని కారును తనిఖీ చేస్తుందని చెప్పింది.

More Telugu News