Pakistan: భారత్ ఫైనల్ ఆశలకు గండికొట్టిన నసీమ్ షా .... ఆఫ్ఘన్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ

  • హోరాహోరీగా సాగిన పాక్, ఆఫ్ఘన్ మ్యాచ్
  • ఒక్క వికెట్ తేడాతో నెగ్గిన పాకిస్థాన్
  • రెండు వరుస సిక్సర్లు కొట్టిన నసీమ్ షా
  • మరో 4 బంతులు మిగిలుండగానే గెలిచిన పాక్
  • ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్
Pakistan thrilling victory over Afghanistan

ఆసియా కప్ లో ఫైనల్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. అందుకు కారణం పాక్ చివరి వరుస బ్యాట్స్ మన్ నసీమ్ షా. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో పాక్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, నసీమ్ షా (4 బంతుల్లో 14 నాటౌట్) వరుసగా రెండు సిక్సర్లు బాది పాక్ ను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘన్ తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేయగా, 130 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 45 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ బాబర్ అజామ్ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఫకార్ జమాన్ (5) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే డాషింగ్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (20) ను రషీద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో బరిలో ఇఫ్తికార్ అహ్మద్ (30), షాదాబ్ ఖాన్ (36) జోడీ పాక్ ను ఆదుకుంది. ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. షాదాబ్ స్కోరులో 1 ఫోర్, 3 సిక్సులున్నాయి. అతడు కొట్టిన ఓ సిక్స్ మైదానం దాటిపోయింది. 

అయితే, ఇఫ్తికార్, షాదాబ్ అవుటయ్యాక పరిస్థితి మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ కు అనుకూలంగా మారింది. తన సెకండ్ స్పెల్ లో లెఫ్టార్మ్ పేసర్ ఫరూకీ రెండు వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. మరో లెఫ్టార్మ్ సీమర్ ఫరీద్ మాలిక్ విజృంభించడంతో ఛేదన కష్టమైంది. ఆసిఫ్ అలీ 8 బంతుల్లో 16 పరుగులు చేసి కాస్త భయపెట్టినా, ఫరీద్ మాలిక్ అతడ్ని స్లో బౌన్సర్ తో బోల్తా కొట్టించాడు. 

పాక్ గెలవాలంటే చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో ఒక్క వికెట్ మాత్రమే మిగిలుంది. అయితే ఫరూకీ వేసిన ఆ ఓవర్లో నసీమ్ షా తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి పాక్ కు అద్భుత విజయం అందించాడు. రెండు ఫుల్ టాస్ బంతులు వేసి ఫరూకీ మూల్యం చెల్లించుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ గెలిచుంటే భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా మిగిలేవి. కానీ ఆఫ్ఘన్ ను ఓడించిన పాక్... అటు భారత జట్టును ఇంటికి పంపి, తాను దర్జాగా ఫైనల్ చేరింది. ఈ నెల 11న జరిగే ఫైనల్లో పాక్ జట్టు శ్రీలంకతో ఆడనుంది.  

సూపర్-4 దశలో పాక్, శ్రీలంక చెరో రెండు విజయాలతో ఫైనల్ చేరాయి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే... ఫైనల్ కు ముందు ఈ రెండు జట్లు సూపర్-4 మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ నెల 9న జరగనుంది. ఒక విధంగా చెప్పాలంటే టైటిల్ పోరుకు ఇది రిహార్సల్ అనుకోవచ్చు. కాగా, సెప్టెంబరు 8న ఆఫ్ఘనిస్థాన్ తో టీమిండియా నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ సేన గెలిచినా ప్రయోజనం ఉండదు. 

కాగా, పాక్, ఆఫ్ఘన్ మ్యాచ్ లో ఓ దశలో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ మాలిక్... పాక్ బ్యాట్స్ మన్ ఆసిఫ్ అలీని అవుట్ చేసి బిగ్గరగా అరవగా, ఆసిఫ్ అలీ అతడ్ని నెట్టివేశాడు. ఆపై బ్యాట్ తో కొట్టేందుకు యత్నించాడు. ఇంతలో, ఆఫ్ఘన్ ఆటగాళ్లు తమ బౌలర్ ఫరీద్ ను అవతలికి లాగేయగా, పాక్ ఆటగాడు హసన్ ఆలీ వచ్చి ఆసిఫ్ అలీని తీసుకెళ్లాడు. 


More Telugu News