Gudivada Amarnath: పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మెగాస్టార్ అభిమానులమైన మేము చాలా బాధపడుతున్నాం: మంత్రి అమర్ నాథ్

  • మరో నటుడితో అమిత్ షా భేటీ అయితే పవన్ తట్టుకోలేకపోతున్నారన్న మంత్రి 
  • పుట్టినరోజు నాడు చిరంజీవికి పవన్ ఆవేదన మిగిల్చారని వ్యాఖ్య 
  • పరిటాల రవి గుండు కొడితే పవన్ బెదిరిపోయాడని ఎద్దేవా 
Gudivada Amarnath comments on Pawan Kalyan

జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెటైర్లు వేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాత్ మరో నటుడు (జూనియర్ ఎన్టీఆర్) భేటీ అయితే పవన్ జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. మూడు రోజుల పొలిటికల్ కాల్షీట్లతో పవన్ బిజీగా ఉన్నారని అన్నారు. 

సీఎం జగన్, వైసీపీపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే... టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయనకు డీల్ కుదిరిందని అనిపిస్తోందని చెప్పారు. చంద్రబాబు వల్ల, చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత ఏర్పాటు చేయబడ్డ పార్టీనే జనసేన అని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ పవన్ చేసిన కామెంట్ల నేపథ్యంలో గుడివాడ అమర్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

పుట్టినరోజు నాడు చిరంజీవికి పవన్ కల్యాణ్ ఆవేదన మిగిల్చారని అమర్ నాథ్ అన్నారు. పవన్ ను కొణిదెల పవన్ కల్యాణ్ అనాలో, నారా పవన్ అనాలో, నాదెండ్ల పవన్ అనాలో అర్థం కావడం లేదని చెప్పారు. పవన్ చర్యల వల్ల చిరంజీవి అభిమానులుగా తాము ఎంతో బాధపడుతున్నామని అన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు లంచం తీసుకున్నట్టు, బెదిరించినట్టు నిరూపించగలరా? అని పవన్ కు గుడివాడ అమర్ నాథ్ సవాల్ విసిరారు. కళ్లుండి కూడా కబోదిగా మాట్లాడితే ఏం చెప్పగలమని అన్నారు. తాము బెదిరిస్తే పవన్ రాష్ట్రంలో తిరగగలరా? అని ప్రశ్నించారు. పరిటాల రవి గుండు కొడితే పవన్ బెదిరిపోయారని అన్నారు. ఏపీకి మూడు రాజధానుల విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.

More Telugu News