Corona Virus: 200 కోట్ల మైలురాయికి చేర‌నున్న‌ భార‌త వ్యాక్సినేష‌న్‌!

  • శ‌నివారం నాటికి 1,99,98,89,097 డోసుల వ్యాక్సిన్ పంపిణీ
  • నిన్న ఒక్క‌రోజే 25,59,840 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ
  • ఆదివారం 20.11 ల‌క్ష‌ల డోసుల పంపిణీ అయితే 200 కోట్ల డోసులు పూర్తి అయిన‌ట్టే
india will reach 200 crores of vaccine doses

ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనా వైర‌స్‌ నుంచి ర‌క్ష‌ణ కోసం వేస్తున్న వ్యాక్సిన్ త‌యారీలో భార‌త్ అన్ని దేశాల‌కు ఆద‌ర్శంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వ్యాక్సిన్ త‌యారీతో పాటు వ్యాక్సిన్ పంపిణీలో భార‌త్ ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిల‌వ‌నుంది. వెర‌సి భార‌త్‌లో ఆదివారం ఓ కీల‌క ఘ‌ట్టం న‌మోదు కానుంది. దేశ ప్ర‌జ‌ల‌కు 200 కోట్ల డోసుల మేర వ్యాక్సిన్ పంపిణీ చేసిన దేశంగా భార‌త్ రికార్డు న‌మోదు చేయ‌నుంది.

శ‌నివారం దాకా దేశంలో 1,99,98,89,097 డోసుల వ్యాక్సిన్‌ను భార‌త ప్ర‌భుత్వం పంపిణీ చేసింది. మ‌రో 20.11 ల‌క్ష‌ల‌ వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేస్తే 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి కానుంది. శ‌నివారం ఒక్క‌రోజే 25,59,840 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన నేప‌థ్యంలో ఆదివారం 20.11 ల‌క్ష‌ల డోసుల పంపిణీ సులువుగానే పూర్తి కానుంది. ఆదివారం 20.11ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తి అయితే.. రికార్డు స్థాయిలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేసిన దేశంగా భాత‌ర్ రికార్డుల‌కు ఎక్క‌నుంది.

ఈ రికార్డు వ్యాక్సినేష‌న్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్ర‌త్యేక దృష్టి సారించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌నుసుఖ్ మాండ‌వీయ వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్న తీరును ప‌రిశీలిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి అయ్యే క్ర‌మాన్ని తెలిపేలా స‌ద‌రు వీడియోలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉద‌యం 10.30 గంట‌ల స‌మ‌యానికే 6 ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేసిన‌ట్లుగా స‌ద‌రు వీడియోలో స్ప‌ష్ట‌మ‌వుతోంది. సాయంత్రంలోగా మిగిలిన 14 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సినేష‌న్ కూడా పూర్తి కావ‌డం ఖాయ‌మేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

More Telugu News