Nara Lokesh: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆక్వా రంగానికి ఈ దుస్థితి: సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

  • రాష్ట్రంలో ఆక్వా పరిస్థితులపై స్పందించిన లోకేశ్
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
  • లేకపోతే ఆక్వా హాలిడే తప్పకపోవచ్చని హెచ్చరిక
  • తన లేఖలో పలు సూచనలు చేసిన లోకేశ్
Nara Lokesh shot a letter to CM Jagan over aqua culture

సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్ర ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని లోకేశ్ ఆరోపించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నీ తక్షణమే నెరవేర్చకపోతే పరిశ్రమలు, వ్యవసాయరంగం దారిలోనే ఆక్వా హాలిడే కూడా తప్పకపోవచ్చని స్పష్టం చేశారు. 

ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా విద్యుత్ యూనిట్ కి రూ.1.50నే కొనసాగించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఆక్వా సాగుదారులకు నాణ్యమైన సీడ్ సరఫరా చేయాలని, విపరీతంగా పెంచిన దాణా ధరలు తగ్గించాలని కోరారు. కనీసం 15 రోజుల పాటు రొయ్యల రేటు పడిపోకుండా నిలకడగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెస్ ను తగ్గించాలని, ధరలు పడిపోతే ప్రభుత్వం నుంచి మద్దతు ధర అందించాలని స్పష్టం చేశారు.

ఆక్వా రంగానికి ప్రభుత్వం నుంచి ఈ విధమైన ప్రోత్సాహకాలు అందకపోతే కోట్లాది రూపాయలు తెచ్చిపెట్టే పరిశ్రమకు కూడా హాలిడే తప్పకపోవచ్చని లోకేశ్ హెచ్చరించారు. దయచేసి ఆక్వా రంగం సంక్షోభంలో పడకుండా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News