DGCA: మాస్కుల్లేని ప్రయాణికులను అనుమతించొద్దు: ఎయిర్ లైన్స్ సంస్థలకు డీజీసీఏ మార్గదర్శకాలు

  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
  • తాజా మార్గదర్శకాలు జారీ చేసిన డీజీసీఏ
  • మాస్కులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు
DGCA issues fresh guideline to Airlines

కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని తాజా కేసుల సరళి చెబుతోంది. దేశంలో మళ్లీ వేలల్లో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో, విమాన ప్రయాణాల సందర్భంగా కొవిడ్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎయిర్ లైన్ సంస్థలకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పష్టం చేసింది. మాస్కులు ధరించడానికి నిరాకరించే ప్రయాణికులను ఏమాత్రం ఉపేక్షించకుండా విమానాల నుంచి కిందికి దించేయాలని పేర్కొంది. విమానాశ్రయాల్లోనూ కరోనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపింది. 

ఎయిర్ పోర్టుల్లోనూ, విమానాల్లోనూ మాస్కులు ధరించనివారి పట్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో డీజీసీఏ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. 

కొవిడ్ ప్రోటోకాల్ పాటించని ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా నిరోధించే అధికారం ఎయిర్ పోర్టు ఆపరేటర్లకు ఉంటుందని, కొన్ని సందర్భాల్లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించే ప్రయాణికులను భద్రతా సిబ్బందికి అప్పగించవచ్చని డీజీసీఏ స్పష్టం చేసింది. కొన్ని తప్పనిసరి పరిస్థితులు, ప్రత్యేక సందర్భాల్లోనే మాస్కులు తీసేసేందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది.

More Telugu News