Suicide: నిన్న రాత్రి బావమరిదిని రూ.10 వేలు అడిగిన వ్యక్తి.. తెల్లారే చెరువులో శవాలై తేలిన కుటుంబం!

  • ఇద్దరు పిల్లలు సహా దంపతుల ఆత్మహత్య
  • పురుగుల మందుతాగి చెరువులోకి దూకిన వైనం
  • అప్పుల బాధతోనే చనిపోయారంటున్న బంధువులు
Family Dies By Suicide due to Financial Crisis

ఆర్థిక ఇబ్బందులో.. మరే ఇతర కారణమో తెలియదు గానీ.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మొదట పురుగుల మందు తాగి ఆ తర్వాత చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ కు సమీపంలోని కుర్మల్ గూడలో జరిగింది.

చనిపోయిన వారిని హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన కుద్దూస్ పాషా (37), ఫాతిమా (28), వారి పిల్లలు మెహర్ (9), ఫిర్దోస్ బేగం (6)లుగా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి కుర్మల్ గూ చెరువులో వారు దూకినట్టు స్థానికులు చెబుతున్నారు. 

చెరువులోకి దూకిన వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కుద్దూస్ పాషా, ఓ చిన్నారిని బయటకు తీయగా.. అప్పటికే వారు మృతి చెందారు. ఇవాళ ఉదయం పోలీసులు ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చేపట్టి ఫాతిమా, మరో చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న రాత్రి కుద్దూస్ తన బావమరిదికి ఫోన్ చేసి రూ.10 వేలు కావాలని అడిగినట్టు తెలుస్తోంది.

More Telugu News