Mosques: దేశంలోని చాలా మసీదులు అంతకుముందు ఆలయాలే.. ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ సంచలన వ్యాఖ్యలు

  • ఆలయాలను కూల్చలేదని వెల్లడి
  • అప్పట్లో చాలా మంది మతం మారారని కామెంట్
  • వాళ్లే ఆలయాలను మసీదులుగా మార్చారని వ్యాఖ్య
There Were Many Mosques That were Built On Temples

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సర్వేలో భాగంగా మసీదులోని కొలనులో శివలింగాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంపై యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా స్పందించారు. దేశంలోని ఆలయాలను కూల్చి వేసి మసీదులను కట్టలేదని, పెద్ద సంఖ్యలో జనం ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని తెలిపారు. అలాంటి మసీదులను ముట్టుకోరాదని తేల్చి చెప్పారు. 

జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందని చెప్పడం.. హిందూయిజాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. దేశంలోని చాలా మసీదులు కట్టడానికి ముందు.. అక్కడ ఆలయాలే ఉండేవని పేర్కొన్నారు. అయితే, ఆ ఆలయాలను కూల్చలేదని చెప్పారు. వాటిని కేవలం మసీదులుగా మార్చారన్నారు. వాటిని ముట్టుకోవద్దని, కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు. 

ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎలాంటి తీర్పు వచ్చిందో తెలిసిందేనని అన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నారు. విద్వేషవాదులు.. దేశంలోని అన్ని మసీదుల్లోనూ కొలనుల్లో శివలింగాలను గుర్తిస్తారన్నారు. వాళ్లు తలచుకుంటే ఏదైనా జరుగుతుందన్నారు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉంటున్నారన్నారు. 

కాగా, జ్ఞానవాపి మసీదులో గుర్తించారంటున్న శివలింగం ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Telugu News