YS Bharathi: వైఎస్ భారతిని ఇంటర్వ్యూ చేసిన ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి... వివరాలు ఇవిగో!

  • గోశాల గురించి అడిగిన శిల్పా రెడ్డి
  • చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకరించారన్న భారతి
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి గొప్పగా చెప్పిన వైనం
Shilpa Reddy asks YS Bharathi

సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతిని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ శిల్పా రెడ్డి ఇంటర్వ్యూ చేశారు. సీఎం జగన్ తాడేపల్లి నివాసంలోని గోశాలలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో శిల్పా రెడ్డి పలు ప్రశ్నలు వేసి వైఎస్ భారతి నుంచి సమాధానాలు రాబట్టారు. గోశాల నిర్మాణం ఎంతో సంప్రదాయబద్ధంగా ఉందని, చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉందని, అందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నరని శిల్పారెడ్డి ప్రశ్నించారు. 

అందుకు వైఎస్ భారతి బదులిస్తూ... గోశాల నిర్మాణానికి మరీ ఎక్కువ సూచనలు ఏవీ మేం పొందలేదని తెలిపారు. అయితే, గోశాల నిర్మాణంలో కృత్రిమత్వం లేకుండా చూడాలని, వీలైనంత వరకు సహజత్వం ఉట్టిపడే ఏర్పాట్లు చేయించాలని భావించామని వివరించారు. గోశాల నిర్మాణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఎంతో సహకారం అందించారని వెల్లడించారు. 

ఈ క్రమంలో తన మామ గారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి వైఎస్ భారతి ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెట్లను ఎక్కువగా పెంచేవారని వెల్లడించారు. "అయితే, చాలామంది ఆయనను... అంత ఆసక్తి ఉంటే పొలంలో పంటలు వేయొచ్చు కదా అనే వారు. అందుకు ఆయన... ఇది భవిష్యత్తు కోసం నేను పెట్టే పెట్టుబడి అని జవాబిచ్చేవారు. ఆ మాట ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది" అని తెలిపారు. 

తమ ఇంటి ఆవరణలోనూ అనేక మొక్కలు నాటుతున్నామని వైఎస్ భారతి తెలిపారు. బొప్పాయి, మొక్కజొన్న తదితరాలను మొదట కుండీల్లో పెంచి, ఆ తర్వాత తమ పెరట్లో నాటినట్టు వివరించారు. అంతేకాదు, తమ ఇంట్లో వండుకునే పాలకూర, మెంతికూరను కూడా తమ పెరట్లో పండినవేనని తెలిపారు. ఇంట్లో పండినవి తినడం ఆరోగ్యదాయకమని అన్నారు.

More Telugu News