Mayawati: నా మద్దతుదారులు తలుచుకుంటే నన్ను ప్రధానమంత్రిని చేయగలరు: మాయావతి

  • ఇటీవల యూపీ ఎన్నికల్లో బీఎస్పీకి ఘోర పరాభవం
  • వివిధ వర్గాలు కలిసొస్తే ప్రధాని అవుతానని వెల్లడి
  • దళితుల అభ్యున్నతే లక్ష్యమని ఉద్ఘాటన 
Mayawati opines in PM post

ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాలు ఎదురైనప్పటికీ తమకు బలమైన క్యాడర్ ఉందని బీఎస్పీ చీఫ్ మాయావతి అంటున్నారు. తన మద్దతుదారులు తలుచుకుంటే తనను ప్రధానమంత్రిని చేయగలరని పేర్కొన్నారు. దళితులు, ముస్లింలు, ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారు ఏకతాటిపై నడిస్తే తాను ప్రధాని అవడం తథ్యమని అన్నారు. ఆయా వర్గాల్లో తన మద్దతుదారులు ఉన్నారని, వారికి తనను ప్రధానిని చేసే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని మాయావతి అభిప్రాయపడ్డారు. 

అయితే, భారత రాష్ట్రపతి కావాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ లేదని, తాను రాష్ట్రపతి కావాలనుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఆమె స్పష్టం చేశారు. తన వరకు ఉత్తరప్రదేశ్ లో గెలిచి తిరిగి అధికారంలోకి రావడం, ఆపై ప్రధాని కావడం గురించి ఆలోచిస్తానేమో కానీ, రాష్ట్రపతి కావాలని మాత్రం ఎన్నడూ కోరుకోనని ఉద్ఘాటించారు. 

తాను రాజకీయాల్లోకి వచ్చింది విలాసవంతమైన జీవితం కోసం కాదని, దళిత ఐకాన్ బీఆర్ అంబేద్కర్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ల ఆశయస్ఫూర్తిని కొనసాగించడం కోసమని మాయావతి చెప్పారు. దళితుల సాధికారతే తన లక్ష్యమని వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో అయితేనే తన లక్ష్యాన్ని సాధించగలనని అభిప్రాయపడ్డారు.

More Telugu News