BiggBoss-5: నేడు బిగ్ బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే... వేదికపై టాలీవుడ్, బాలీవుడ్ తారల సందడి

  • గత 3 నెలలుగా అలరిస్తున్న బిగ్ బాస్-5
  • నేటితో ముగింపు
  • సందడిగా గ్రాండ్ ఫినాలే
  • సన్నీయే విజేత అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • మరికొన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ
All set for Bigg Boss Seasin Five Grand Finale

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా గత 100 రోజులకు పైగా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్-5 రియాలిటీ షో నేటితో ముగియనుంది. స్టార్ మా చానల్లో నేడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో టాలీవుడ్, బాలీవుడ్ తారలు సందడి చేయనున్నారు. 'పుష్ప' చిత్రం ప్రచారం కోసం దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్... 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రమోషన్ కోసం రాజమౌళి ఈ కార్యక్రమంలో అలరించనున్నారు.

ఇక బాలీవుడ్ నుంచి 'బ్రహ్మాస్త్ర' చిత్రం కోసం రణబీర్ కపూర్, అలియాభట్ అలరించనున్నారు. కాగా, నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి మరీ అల్లరి చేయనున్నారు. వీరు కంటెస్టెంట్లతో ఆడిపాడతారని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్-5లో ఫైనల్ వీక్ లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మానస్, సిరి ఉన్న సంగతి తెలిసిందే. కాగా, బిగ్ బాస్ టైటిల్ ను సన్నీ గెలిచినట్టు సోషల్ మీడియాలో నిన్నటి నుంచే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో మరికొన్ని గంటల్లో తేలనుంది. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నేటి సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మా చానల్లో ప్రసారం కానుంది.

More Telugu News