Chhattisgarh: లక్నో విమానాశ్రయంలో బైఠాయించిన ఛత్తీస్‌గఢ్ సీఎం!

  • లక్నో విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఛత్తీస్‌గఢ్ సీఎం
  • బయటకు వెళ్లకుండా అడ్డుకున్న యూపీ పోలీసులు
  • ఎయిర్‌పోర్టులోనే కూర్చొని నిరసన తెలిపిన కాంగ్రెస్ నేత
  •  లఖీంపూర్ వెళ్లడం లేదు.. ప్రియాంకను కలవడానికి వచ్చా: భూపేష్ బాఘేల్
Chhattisgarh CM reaches UP stages dharna at airport

లఖీంపూర్ హింసాకాండ నేపథ్యంలో లక్నో విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రాజకీయ నేతలెవరూ విమానాశ్రయంలో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బాఘేల్ కూడా లక్నో చేరుకున్నారు.

తాను లక్షింపూర్ వెళ్లడం లేదని, హౌస్ అరెస్టులో ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని కలవడానికి వచ్చానని ఆయన చెప్పారు. అయినా సరే బాఘేల్‌ను విమానాశ్రయం బయటకు వెళ్లడానికి పోలీసులు అంగీకరించలేదు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన విమానాశ్రయంలోనే బైఠాయించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సమయంలో లఖింపూర్ ‌లో హింసాకాండ జరిగిన సంగతి తెలిసిందే. నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు దూసుకెళ్లింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. అయితే పరిస్థితి చేతులు దాటకుండా ఉండేందుకు మృతుల కుటుంబాలకు యూపీ సర్కారు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది.

More Telugu News