Madhya Pradesh: మరీ ఎక్కువగా తీసుకోకండి.. కొంచెం తీసుకోండి.. లంచం విషయంలో అధికారులకు సలహాలిస్తున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

  • మధ్యప్రదేశ్‌‌లో బీఎస్పీ ఎమ్మెల్యే రామాబాయి పాఠాలు
  • పీఎంఏవై కింద ఇళ్లు ఇప్పిస్తామని లంచం తీసుకున్న అధికారులు
  • మరీ ఎక్కువ తీసుకున్నారని నిందించిన ఎమ్మెల్యే
MLA asks officers to take little bribes but not too much video goes viral

అధికారులు లంచం తీసుకుంటున్నారని ఆ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు ప్రజలు. అలాంటప్పుడు ఎవరైనా అధికారులను మందలిస్తారు. లేదంటే సస్పెండ్ చేయిస్తారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం మరీ అంత లంచం తీసుకోవద్దని, కొంచెం తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాటువా గ్రామంలో జరిగింది. తమకు ప్రధానమంత్రి ఆవాసయోజన (పీఎంఏవై) కింద ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి భారీగా లంచాలు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆమెకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే.. గ్రామస్థులు, అధికారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ పంచాయతీలో గ్రామస్థులను నిలబెట్టి ‘నీ దగ్గర ఎంత తీసుకున్నారు?’ అంటూ ప్రశ్నించింది. వారిలో ఒకరు రూ.9 వేలు, మరొకరు రూ. 6 వేలు, మరొకరు రూ. 5 వేలు ఇలా సమాధానాలు చెప్పారు.

ఈ మాటలన్నీ విన్న బీఎస్పీ ఎమ్మెల్యే రాధాబాయి.. అధికారులను మందలించారు. ‘‘లంచం తీసుకోవద్దని నేను చెప్పను. కానీ మరీ అంత తీసుకోకూడదు. వెయ్యి రూపాయలు చాలు’’ అని చెప్పింది. అలాగే అవినీతి రాజ్యం అనే అర్థం వచ్చేలా ఒక హిందీ సామెత కూడా చెప్పారామె. అనంతరం వారిని శిక్షించకపోవడమే ఎక్కువని, కాబట్టి వాళ్లు తీసుకున్న లంచం తిరిగిచ్చేయాలని అధికారులకు సూచించారు.

దీన్నంతా అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ బిల్లుకు రాధాబాయి మద్దతు తెలిపింది. అప్పుడు పార్టీ అధినేత్రి మాయావతి ఆమెను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత తన మాటలను వక్రీకరించారంటూ రాధాబాయి వివరణ ఇచ్చుకున్నారు.

More Telugu News