Andhra Pradesh: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అమ్ముతామంటే ఊరుకోబోం.. జగన్ మౌనానికి కారణాలు అనేకం: సీపీఎం నేత బృందాకారత్

  • జగన్ చూస్తూ కూర్చున్నా మేం అడ్డుకుంటాం
  • మోదీ ఏడాదిలో 67సార్లు ధరలు పెంచారు
  • కేరళలోలా పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలి
CPM leader Brinda Karat fires on jagan and modi

ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అమ్ముతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. జగన్ మౌనంగా ఉన్నా తాము మాత్రం అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.

 నిన్న విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం మందిరంలో సీపీఎం నిర్వహించిన విశాఖ ఉక్కు పరిరక్షణ సభలో ఆమె మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం అమ్మేయాలని చూస్తున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకున్నా జగన్ మౌనంగా ఉంటున్నారని, ఆ మౌనానికి అనేక కారణాలు ఉన్నాయని దుయ్యబట్టారు.

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 67 సార్లు ధరలు పెంచిందన్నారు. రూ. 3.5 లక్షల కోట్లు కేంద్రం జేబుల్లోకి వెళ్లాయన్నారు. జీఎస్టీలో కేరళకు ఇవ్వాల్సిన వాటాను ఇచ్చేందుకు కేంద్రం నిరాకరిస్తే అక్కడి పార్టీలన్నీ ఒక్కటై పోరాడాయని బృందాకారత్ గుర్తు చేశారు. అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇదే పరిస్థితి ఏపీలోనూ రావాలన్నారు. పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే ప్రత్యేక హోదా/ ప్యాకేజీ వస్తుందని బృందా కారత్ స్పష్టం చేశారు.

More Telugu News