Australia: పెన్షన్ డబ్బు కోసం తల్లి మృతదేహాన్ని దాచిన కుమారుడు!

  • జూన్ లో మరణించిన 89 ఏళ్ల వృద్ధురాలు
  • మరణవార్త దాచిపెట్టిన కుమారుడు
  • పోస్ట్ మ్యాన్ కు అనుమానం రావడంతో అసలు నిజం వెలుగులోకి
Son hides her mothers death to get pension money

డబ్బుల కోసం కొందరు మనుషులు ఎంత నీచానికైనా వెనకాడటంలేదు. ఒక రూపాయి వస్తుందంటే ఏ పని చేయడానికైనా వెనుకాడని వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక వ్యక్తి అయితే డబ్బు కోసం కన్నతల్లి మృతదేహాన్ని సైతం దాచి పెట్టి, ఆమె బ్రతికే ఉందని ప్రపంచాన్ని నమ్మించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

తన తల్లి చనిపోయిందని తెలిస్తే ఆమె పేరుపై వచ్చే పెన్షన్ రాదని, ఓ కుమారుడు ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టాడు. అబద్ధం ఎన్నో ఏళ్ళు దాగదన్న మాటను నిజం చేస్తూ ఈ తంతు అంతా బయటపడింది. దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 89 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు. ఆమె తన పెద్ద కుమారుడి (66)తో కలిసి నివసిస్తోంది. వారు టైరోల్ ప్రాంతంలోని ఇన్స్‌బ్రక్ సమీపంలో ఉంటున్నారు. ఆమెకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఈ క్రమంలో గతేడాది జూన్‌లో ఆమె మరణించింది. కానీ ఆమె కుమారుడు పెన్షన్ డబ్బుకోసం ఆమె మరణ వార్తను బయటకు రానీయలేదు. ఆమె మృతదేహాన్ని ఐస్‌ప్యాక్‌లో పెట్టి భద్రపరిచి ప్రతి నెలా ఆమె పేరిట వచ్చే పెన్షన్‌ను తీసుకుంటున్నాడు. ఇలా సుమారు 60 వేల డాలర్లు తీసుకున్నాడు.

ఈ సమయంలో తన సోదరుడు వచ్చి తల్లి గురించి అడిగితే.. ఆమెకు అనారోగ్యంగా ఉందని, అందుకే ఆస్పత్రిలో చేర్చానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ ఏరియాకు కొత్త పోస్ట్ మ్యాన్ రావడంతో ఈ తతంగం బయట పడింది. కొత్తగా వచ్చిన పోస్ట్ మ్యాన్ లబ్దిదారు అయిన వృద్ధురాలిని చూసిన తరువాతనే పెన్షన్ ఇస్తానని అన్నాడు. దీనికి ఆ కుమారుడు నిరాకరించడంతో పోస్ట్ మ్యాన్ పెన్షన్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు.

ఇక్కడి వ్యవహారం కాస్త విచిత్రంగా అనిపించడంతో సదరు పోస్ట్ మ్యాన్ తన పైఅధికారులకు సమాచారం అందించాడు. దాంతో స్పందించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి నిందితుడి ఇంటిని సోదా చేశారు. దాంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వృద్ధురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News