CPI Narayana: అమిత్ షా ఉన్నంత కాలం జగన్ బెయిల్ రద్దు కాదు: సీపీఐ నారాయణ

  • జగన్ కు అమిత్ షా అండదండలు ఉన్నాయి
  • కరోనా కట్టడిలో కేంద్రం ఘోరంగా విఫలమయింది
  • మోదీ అంతటి దారుణమైన ప్రధాని మరొకరు లేరు
Jagan bail will not be cancelled as long as Amit Shah is there says CPI Narayana

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండదండలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారని... అయితే, అమిత్ షా అండ ఉన్నంత కాలం జగన్ బెయిల్ రద్దు కాదని చెప్పారు. మరోవైపు రఘురాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ కోరుతోందని... వీరిరువురి నాటకాలను అమిత్ షా చూస్తున్నారని అన్నారు.

కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని నారాయణ విమర్శించారు. మహమ్మారి వల్ల కార్పొరేట్ ఆసుపత్రులు బాగుపడ్డాయని అన్నారు. మోదీ పాలనలో అంబానీ, అదానీల ఆస్తులు భారీగా పెరిగాయని చెప్పారు. కరోనా వల్ల చనిపోయిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వలేమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం... కార్పొరేట్లకు మాత్రం రూ. 1.60 లక్షల కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్ మొత్తాన్ని అమ్మకానికి పెట్టేసిందని దుయ్యబట్టారు.  

మన దేశ చరిత్రలో మోదీ అంతటి దారుణమైన ప్రధాని మరొకరు లేరని నారాయణ అన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులు బానిసలు అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వాజ్ పేయి మంచి రాజకీయ నేత అని... మోదీ ఫ్యాక్షనిస్టు నేత అని విమర్శించారు. సీబీఐ, ఈసీ, ఆర్బీఐ, న్యాయ వ్యవస్థలను మోదీ డమ్మీ చేశారని మండిపడ్డారు. 

More Telugu News