Uttar Pradesh: యూపీలో మ‌హిళ చీర కొంగు లాగి రెచ్చిపోయిన వైనం.. వీడియో వైర‌ల్!

  • సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళను అడ్డుకున్న ప్ర‌త్య‌ర్థి పార్టీ కార్య‌క‌ర్త‌లు
  • నామినేష‌న్‌కు మ‌ద్ద‌తు తెల‌పకూడ‌ద‌ని డిమాండ్
  • మండిప‌డ్డ అఖిలేశ్, ప్రియాంక గాంధీ
ruckus in up

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ మహిళకొంగు పట్టుకుని లాగారు ప్ర‌త్య‌ర్థులు. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వివ‌రాల్లోకి వెళ్తే... లఖింపూర్‌ ఖేరీ ప‌రిధిలో పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదించ‌డానికి స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ మ‌హిళ నామినేషన్ కేంద్రానికి వెళుతోంది.

ఆ స‌మ‌యంలో ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ ప్రత్యర్థులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ చీర కొంగును ప‌ట్టుకుని లాగారు. ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను లాక్కున్నారు. దీంతో ఆమెకు మద్ధతుగా కొంద‌రు ముందుకు వ‌చ్చి విడిపించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు సేక‌రించారు.

స‌మాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎన్నికలో పోటీలో నిల‌వ‌కుండా చేసి త‌మ అభ్య‌ర్థిని ఏకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లే దాడికి పాల్ప‌డ్డార‌ని సమాజ్‌వాదీ పార్టీ నేత‌లు అరోపిస్తున్నారు.

అధికార దాహంతోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన గూండాలు ఇటువంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మ‌హిళ‌పై దారుణానికి పాల్ప‌డిన ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. యూపీలో 825 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

More Telugu News