Perni Nani: చేసేది తప్పా, ఒప్పా అని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడంలేదు: మంత్రి పేర్ని నాని

  • ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ
  • మీడియాతో మాట్లాడిన మంత్రులు పేర్ని నాని, అనిల్
  • తెలంగాణ వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న నాని
  • తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నారని అనిల్ ఆగ్రహం
Perni Nani slams Telangana projects over projects

ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జల ప్రాజెక్టుల అంశంపై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అవసరాల గురించి కూడా ఆలోచించడంలేదని విమర్శించారు. డెడ్ లైన్ స్టోరేజి నీటిని కూడా విద్యుదుత్పత్తి పేరుతో వాడుకోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ లైన్ నిల్వ నీటిని కరెంటు పేరుతో వాడుకుంటున్నారని వివరించారు. చేసే పని తప్పా, ఒప్పా అని కూడా తెలంగాణ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఏపీ క్యాబినెట్ తీవ్రంగా పరిగణిస్తోందని పేర్ని నాని తెలిపారు.

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులను కడుతున్నామని స్పష్టం చేశారు. కేటాయించిన నీటి వాటాలను తక్కువ సమయంలో తీసుకోవాలంటే ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకోక తప్పదని వివరించారు. కానీ, తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారని అనిల్ విమర్శించారు. ముఖ్యంగా, వైఎస్సార్ ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుదుత్పత్తి చేయాల్సి ఉండగా, ఇష్టంవచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News