రికార్డు కోసం అధికారుల నిర్వాకం... మధ్యప్రదేశ్ జాబితాలో 13 ఏళ్ల బాలుడి పేరు!

Madhyapradesh Officials give Certificatate they Give vaccine for 13 Year old
గత సోమవారం రాత్రి 7.27 గంటలకు భోపాల్ లో నివాసం ఉంటున్న రజత్ దాంగ్రే ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది. అందులోని సమాచారం ఏంటంటే... రజత్ కుమారుడు వేదాంత్ దాంగ్రేకు కరోనా టీకాను వేయడం జరిగింది. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ సమాచారం రాగానే రజత్ అవాక్కయ్యారు. ఇంతవరకూ దేశంలో 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతులే లేకపోగా, 13 ఏళ్ల తన కుమారుడికి ఎప్పుడు, ఎక్కడ, ఎవరు వ్యాక్సిన్ వేశారా? అని అయోమయంలో పడ్డాడు.

ప్రభుత్వం నుంచి వచ్చిన మెసేజ్ లో వేదాంత్ వయసు 56 సంవత్సరాలుగా పేర్కొనడం గమనార్హం. ఈ సమాచారాన్ని చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వెంటనే అందులోని లింక్ ను ఓపెన్ చేసి చూడగా, వ్యాక్సిన్ వేసినట్టు సర్టిఫికెట్ కూడా వచ్చిందని రజత్ తెలిపారు. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్లి విఫలం అయ్యానని, దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ కోసం ఇటీవల మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి, కొన్ని ధ్రువపత్రాలను ఇచ్చానని, వాటిని అధికారులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

కాగా, ఈ నెల 21న మధ్యప్రదేశ్, వ్యాక్సినేషన్ లో జాతీయ రికార్డును సృష్టిస్తూ, 17.42 లక్షల మందికి టీకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చాలా మంది తాము టీకాలు తీసుకోకున్నా, తమ సెల్ ఫోన్లకు టీకా తీసుకున్నట్టు సమాచారం, ఆ వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వస్తోందని ఆరోపించారు.

వేదాంత్ దాంగ్రేకు టీకా వేశామని చెప్పిన రోజే, సాత్నా జిల్లాలో ఉండే చినేంద్ర పాండేకు ఐదు నిమిషాల వ్యవధిలో ముగ్గురికి టీకాలు వేసినట్టుగా మెసేజ్ లు వచ్చాయి. ఆ ముగ్గురూ ఎవరో కూడా తనకు తెలియదని అతను ఆరోపించారు. భోపాల్ లోనే ఉండే నుజహత్ సలీమ్ (46)కు ఎటువంటి పెన్షన్ రాకున్నా, ఆమె పెన్షనర్ అని ప్రూఫ్ చూపుతూ వ్యాక్సిన్ వేసినట్టుగా మెసేజ్ వచ్చింది. వీరే కాదు... ఇంకా చాలా మంది ఇటువంటి అనుభవాలనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు వీరంతా తాము రెండు డోస్ లను ఎలా పొందాలా? అన్న ఆందోళనలో ఉన్నారు.
Go Back to Shorts
Madhya Pradesh
Vaccination
Bhopal

More Telugu News