Kodali Nani: టీడీపీని తొక్కేసి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: మంత్రి కొడాలి నాని

  • రాజశేఖరరెడ్డి రాక్షసుడు కాదు రక్షకుడు
  • ఆయన ఉన్నప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంది
  • రాష్ట్రంలో బీజేపీని పట్టించుకునే వాళ్లు కూడా ఉన్నారా?
AP minister Kodali Nani fires on BJP

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కొందరు రాక్షసుడు అని విమర్శిస్తున్నారని, కానీ ఆయన రాక్షసుడు కాదని, రక్షకుడని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన బతికి ఉన్నన్నాళ్లు రాష్ట్రం సమైక్యంగా ఉందని అన్నారు. తాడేపల్లిలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  రాజశేఖరరెడ్డి ప్రజలకు ఎన్నో చేశారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చారని, ప్రాజెక్టులు చేపట్టారని, ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. మరణించిన వారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలని మంత్రి హితవు పలికారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ వెనక్కి తగ్గబోరని, ఉడత ఊపులకు, బెదిరింపులకు భయపడరని అన్నారు.  ఏ ప్రభుత్వానికైనా సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు.  అలాగే, బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో, వైసీపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్కలు తీద్దామని అన్నారు. టీడీపీని తొక్కేసి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. చంద్రబాబు దీక్ష నిర్వహిస్తుంటే పోటీగా బీజేపీ కూడా ఏదో ఒకటి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారా? అని మంత్రి నాని ప్రశ్నించారు.

More Telugu News