Couple: డబ్బు కోసం... భార్యను చెల్లి అని చెప్పి వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు!

  • పెళ్లి చేసుకోవాలనుకున్న రవి అనే వ్యక్తి
  • మ్యారేజి బ్రోకర్ ను సంప్రదించిన వైనం
  • ఫొటోలు చూపించిన బ్రోకర్
  • కోమల్ అనే అమ్మాయిని ఇష్టపడిన రవి
  • పెళ్లయిన మూడో రోజే కనిపించకుండా పోయిన అమ్మాయి
Police arrests cheating couple

రాజస్థాన్ లో ఓ జంట డబ్బు కోసం మోసాలకు తెరలేపింది. కట్టుకున్న భార్యను చెల్లిగా పేర్కొన్న భర్త, ఆమెను మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆపై, ఆ మాయలాడి కొత్త భర్త ఇంట్లో నగదు నట్రా తీసుకుని పరారైంది. ఈ కేసు వివరాల్లోకెళితే... రాజస్థాన్ లోని కోటా జిల్లాలో కునాడి ప్రాంతంలో నివసించే రవి అనే వ్యక్తి పెళ్లికోసం మ్యారేజి బ్రోకర్ ను కలిశాడు. ఆ బ్రోకర్... రవికి పెళ్లికాని అమ్మాయిల ఫొటోలు చూపించాడు. వాటిలో కోమల్ అనే అమ్మాయి అందంగా ఉండడంతో రవి ఆమె వివరాలు కోరాడు.

కోమల్ కు ఓ సోదరుడు తప్ప మరెవ్వరూ లేరని ఆ బ్రోకర్ తెలిపాడు. రవి పెళ్లికి సిద్ధపడడంతో, ఆమె అన్నయ్యను ముందుగా కలిసి మాట్లాడాలని బ్రోకర్ సూచించాడు. దాంతో ఓ హోటల్ లో సోనూ కార్పరే అనే వ్యక్తిని కోమల్ అన్నయ్య అంటూ బ్రోకర్ పరిచయం చేశాడు. రవి, సోనూ కార్పరే పెళ్లి విషయాలు మాట్లాడుకున్నారు. కట్నం ఇవ్వలేమని సోనూ కార్పరే చెప్పినా, కోమల్ అందం చూసిన రవి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో రవి, కోమల్ పెళ్లి ఓ గుడిలో జరిగింది.

ఆపై కాపురానికి వెళ్లిన మూడో రోజే కోమల్ తన నిజస్వరూపం ప్రదర్శించింది. రవి ఇంట్లో ఉన్న నగలు, నగదుతో ఉడాయించింది. భార్య కనిపించకపోవడంతో రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మ్యారేజి బ్రోకర్ ను విచారించడంతో ఆ జంట గుట్టురట్టయింది. సోనూ కార్పరే, కోమల్ అన్నాచెల్లెళ్లు కాదని, భార్యాభర్తలని వెల్లడైంది. వారిది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అని గుర్తించారు. పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలన్న దురాశతో ఇలా అడ్డదారులు తొక్కినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ మోసకారి భార్యాభర్తలు పోలీసుల అదుపులో ఉన్నారు.

More Telugu News