Congress: ఆదివారం దాచెయ్​.. సోమవారం వేసెయ్​..!​: వ్యాక్సినేషన్​ రికార్డుపై చిదంబరం వ్యంగ్యం

  • రికార్డు వెనక రహస్యమన్న కాంగ్రెస్ నేత
  • గిన్నిస్ లోకి ఎక్కుతుందని సెటైర్
  • మెడిసిన్ లో మోదీకి నోబెల్ కూడా రావొచ్చని ఎద్దేవా
Chidambaram Fires Over Center Vaccination Record On Monday

వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మండిపడ్డారు. సోమవారం రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసి.. మరుసటి రోజే భారీగా పడిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ముందు వ్యాక్సిన్లన్నింటినీ దాచేసి.. ఆ తర్వాత వేసి.. మళ్లీ మామూలుగా ఇబ్బందులు పడడమే రికార్డు వెనక ఉన్న అసలు రహస్యమని ఎద్దేవా చేశారు.

‘‘ఆదివారం దాచెయ్.. సోమవారం వేసెయ్.. మంగళవారం చేతులెత్తేయ్’’ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇదే ఒక్కరోజులో ఎక్కువ మందికి టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించడం వెనక అసలు రహస్యమని అన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ ఈ ఫీట్ కు చోటు దక్కక తప్పదంటూ సెటైర్ విసిరారు.

అంతేగాకుండా.. ‘‘మోదీ ప్రభుత్వానికి మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ ఇచ్చినా ఇస్తారు. ఎవరికి తెలుసు!’’ అని మరో కామెంట్ చేశారు. ‘మోదీ ఉంటే ప్రతిదీ సంభవమే’ అన్న దానిని ‘మోదీ ఉన్న చోట అద్భుతాలే’గా మార్చుకోవాలన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానాల్లో ఆదివారం నుంచి సోమవారం వరకు జరిగిన వ్యాక్సినేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రజాలం చేస్తున్నాయంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ లను మరికొన్ని రోజులు పరిశీలించి చూడాలన్నారు. సోమవారం నాటి రికార్డుకు డాక్టర్లకు కితాబునిస్తున్నారని, కానీ, ఆ నంబర్లనే ‘డాక్టర్ (లెక్కలను మార్చేస్తున్నారు)’ చేసేస్తున్నారు అని విమర్శించారు.

More Telugu News