Narendra Modi: యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే

  • ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై విరుచుకుపడ్డ యాస్
  • తీర ప్రాంతాలను కుదిపేసిన అతి తీవ్ర తుపాను
  • ఒడిశాలోని భద్రక్, బెంగాల్ లోని మిడ్నపూర్ ప్రాంతాల్లో భారీ నష్టం
  • ఒడిశా సీఎంతో మోదీ సమావేశం
  • మమతా బెనర్జీతోనూ చర్చించనున్న ప్రధాని
PM Modi aerial survey on cyclone affected areas

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడి తూర్పు తీరంపై విరుచుకుపడిన యాస్ తుపానుతో అపార నష్టం కలిగింది. ఈ తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వే నిర్వహించారు. మొదట ఒడిశా సీఎంతో సమావేశం నిర్వహించిన మోదీ, ఆపై యాస్ తుపానుతో అతలాకుతలం అయిన భద్రక్ జిల్లాను గగనతలం నుంచి పరిశీలించారు.

 అనంతరం పశ్చిమ బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నపూర్ ప్రాంతంలోనూ ఏరియల్ సర్వే నిర్వహించి తుపాను బీభత్సం మిగిల్చిన నష్టాన్ని పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం ప్రధాని మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇతర అధికారులతో యాస్ తుపాను నష్టంపై చర్చిస్తారని తెలుస్తోంది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వణికించిన యాస్ తుపాను తీవ్ర విధ్వంసం సృష్టించడం తెలిసిందే. ఈ అతి తీవ్ర తుపాను ధాటికి రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో విపరీతమైన నష్టం వాటిల్లింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు చెట్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. సాదా ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించకపోతే తీవ్ర ప్రాణనష్టం జరిగి ఉండేది. అప్పటికీ ఒడిశాలో ముగ్గురు, పశ్చిమ బెంగాల్ లో ఒకరు మరణించారు.

More Telugu News