Congress: ప్రజలకు కావాల్సింది మొసలి కన్నీరు కాదు.. టీకాలు: మోదీపై కాంగ్రెస్ ఫైర్

  • కరోనా కట్టడిపై దృష్టి పెట్టకుంటే థర్డ్ వేవ్ తప్పదు
  • ఆ 216 కోట్ల వ్యాక్సిన్లు ఎలా వస్తాయో చెప్పండి
  • జులై 30 నాటికి 30 కోట్ల మందికి వేస్తామన్నారు కదా.. ఏమైంది?
people dont want crocodile tears Congress Fires

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రజలకు కావాల్సింది టీకాలు తప్పితే మొసలి కన్నీరు కాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. టీకాలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, కరోనా కట్టడిపై దృష్టి పెట్టకుంటే థర్డ్ వేవ్ తప్పదని ఆ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారత్‌లో టీకా కార్యక్రమం నత్తనడకన సాగుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్‌లు ఇప్పటికే హెచ్చరించాయన్నారు.

ఈ ఏడాది చివరి నాటికి 216 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందుబాటులోకి వస్తాయన్న కేంద్రం వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఈ విషయంలో మరింత వివరణ ఇవ్వాలన్నారు. ఏయే రకాల వ్యాక్సిన్లు, ఎవరి దగ్గరి నుంచి కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఏమైనా అధారాలు ఉంటే చూపించాలన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది టీకాలు మాత్రమేనని, మొసలి కన్నీళ్లు కాదని ప్రధానిని ఉద్దేశించి అన్నారు. జులై నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు వేసింది 4.1 కోట్ల మందికి మాత్రమేనని ఆయన గుర్తు చేశారు.

More Telugu News