ఆశ్చర్యం... నకిలీ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు తీసుకున్నా బ్రతికారు!

They beat corona with fake Remdesivir injections
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తున్న వేళ, రెమ్ డెసివిర్ ఔషధానికి తీవ్ర డిమాండ్ ఏర్పడింది. దీన్ని బ్లాక్ మార్కెట్లో రూ.50 వేల వరకు విక్రయిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతేకాదు, నకిలీ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు కూడా అమ్ముతున్నారు. గుజరాత్ కు చెందిన ఓ ముఠా ఈ నకిలీ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల దందా నడిపిస్తున్నట్టు మధ్యప్రదేశ్ పోలీసుల విచారణలో తేలింది.

విస్మయం కలిగించే విషయం ఏమిటంటే... నకిలీ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు చేయించుకున్న వారిలో 90 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారట. వారిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు బాగా నయమైనట్టు గుర్తించారు. అయినప్పటికీ, ఫేక్ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వారిపై హత్య కేసులు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

ఈ నకిలీ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల ముఠాకు చెందిన వారిని ఇండోర్, జబల్ పూర్ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి నకిలీ ఇంజెక్షన్లు పొందినవారిలో పెద్దగా మరణాలు సంభవించకపోవడంతో పోలీసులు హత్య కేసులు ఎలా నమోదు చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాలు లేకుండా నిందితులపై మర్డర్ కేసులు బుక్ చేయడంపై అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు.

కాగా, పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ నకిలీ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లలో గ్లూకోజ్, ఉప్పు కలిపిన ద్రావణం ఉన్నట్టు వెల్లడైంది. తామేమీ వైద్య నిపుణులం కాదని, ఈ వ్యవహారంలో డాక్టర్లు దృష్టి సారిస్తే తమ విచారణ సులువవుతుందని మధ్యప్రదేశ్ పోలీసు అధికారులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Remdesivir
Fake Injections
Corona
Madhya Pradesh
Gujarath

More Telugu News