Etela Rajender: చ‌ర్య‌లు తీసుకోకుండా ఆదేశించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించిన ఈట‌ల కుటుంబం

  • అచ్చంపేటలో అసైన్డ్ భూములను క‌బ్జా చేశార‌ని ఆరోప‌ణ‌లు
  • భూముల స‌ర్వే పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌లేద‌న్న ఈట‌ల కుటుంబం
  • చట్ట విరుద్ధంగా సర్వే చేశారని పిటిష‌న్
  • భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని విజ్ఞ‌ప్తి
  • త‌మ‌పై బలవంతంగా చర్యలు తీసుకోకుండా ఆదేశించాల‌ని పిటిష‌న్
etela family files petition in high court

మెదక్‌ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూములను తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కబ్జా చేశారనే ఆరోపణలు క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈటలను ఇప్ప‌టికే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. అయితే, రెండు రోజుల క్రితం జ‌రిపిన‌ భూముల స‌ర్వే పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌లేద‌ని ఈట‌ల అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది.  

తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని పేర్కొంటూ ఈటల రాజేంద‌ర్ భార్య‌, కుమారుడు, జమునా హేచరీస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మెద‌క్ క‌లెక్ట‌ర్ ఇచ్చిన నివేదిక త‌ప్పుల త‌డ‌క‌గా ఉందని చెప్పారు. త‌మ‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వ‌కుండా హేచ‌రీస్‌లోకి వెళ్లి విచార‌ణ చేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది.

అచ్చంపేట‌లోని తమకు సంబంధించిన భూముల్లో అక్ర‌మంగా ప్ర‌వేశించి, సర్వే చేసి బోర్డులను పెట్టారని కోర్టుకు తెలిపారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని హైకోర్టును కోరారు. అలాగే, త‌మ‌పై బలవంతంగా చర్యలు తీసుకోకుండా డీజీపీతో పాటు విజిలెన్స్, మెదక్‌ కలెక్టర్‌ను ఆదేశించాలని ఈట‌ల కుటుంబస‌భ్యులు విజ్ఞ‌ప్తి చేశారు.

భూములు ఎవ‌రి నుంచి కొనుగోలు చేశారు? ఆ త‌ర్వాత ప‌రిణామాల గురించి కూడా ఈట‌ల కుటుంబం పూర్తి వివ‌రాలు తెలిపిన‌ట్లు తెలిసింది. ఈ పిటిష‌న్ హైకోర్టులో ఎప్పుడు విచార‌ణ‌కు వ‌స్తుంద‌నే విష‌యంపై వివ‌రాలు అందాల్సి ఉంది.

More Telugu News