Andhra Pradesh: ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోందన్న కేంద్ర ఆరోగ్య శాఖ!

  • ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో కొత్త కేసుల్లో స్థిరత్వం
  • 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు
  • 22 రాష్ట్రాల్లో 15 శాతానికి పైగా పాజిటివిటీ రేటు
  • ఒక్కరోజులో 78 నుంచి 82% పెరిగిన రికవరీ రేటు
  • 18-44 ఏళ్ల కేటగిరీలో 20 లక్షల మందికి టీకా
  • మీడియా సమావేశంలో వెల్లడించిన లవ్‌ అగర్వాల్‌
cases increasing in ap assam and 4 other states is a cause of concern

ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో కరోనా రోజువారీ కేసుల్లో కాస్త స్థిరత్వం వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో తాజాగా కేసులు ఎగబాకుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.  

12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని.. అవే ఆందోళన కలిగిస్తున్నాయని అగర్వాల్‌ తెలిపారు. ఇక 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉందని వెల్లడించారు. ఇక కరోనా ఉద్ధృతి ఆందోళనకరంగా ఉన్న మహారాష్ట్రలో 12 జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీల విషయంలోనూ సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. నిన్న 78 శాతంగా ఉన్న రికవరీ నేడు 82 శాతానికి పెరిగిందని తెలిపారు.

12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని అగర్వాల్‌ తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు గల 20 లక్షల మందికి టీకాలు అందాయని వెల్లడించారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామన్నారు.

More Telugu News