Somesh Kumar: ఉచిత వ్యాక్సినేషన్ కు సహకరించాలన్న తెలంగాణ సర్కారు... సానుకూలంగా స్పందించిన భారత్ బయోటెక్

  • భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ సమావేశం
  • హాజరైన బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా
  • తెలంగాణకు టీకా డోసులు అందిస్తామని వెల్లడి
  • రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడినవారికి ఉచితంగా వ్యాక్సిన్
  • రూ.2,500 కోట్ల వ్యయంతో కార్యాచరణ
Somesh Kumar held meeting with Bharat Biotech reps

కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లా, ప్రతినిధులతో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఈ భేటీ నిర్వహించారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ కు సరిపడా డోసులు సరఫరా చేయాలని భారత్ బయోటెక్ ను కోరారు.

తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సినేషన్ కు తమ తోడ్పాటు ఉంటుందని, అందుకు అవసరమైన టీకా డోసులు అందజేస్తామని వెల్లడించారు. కరోనా టీకా డోసుల పంపిణీలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉచిత వ్యాక్సినేషన్ కోసం రూ.2,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

More Telugu News