COVID19: కరోనా మరణాల లెక్కలను దాచిపెడుతున్న మధ్యప్రదేశ్​ సర్కార్​?

Madhya Pradesh Hiding Covid Deaths Cremations Challenge Official Data
  • కాలుతున్న శవాలకు.. సర్కార్ లెక్కలకు కుదరని పొంతన
  • తామేమీ దాయట్లేదంటున్న మంత్రి
  • దాస్తే ఎవరూ అవార్డులివ్వరని కామెంట్
  • భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత ఇంతటి విపత్తును చూడలేదంటున్న స్థానికులు
ఓవైపు కుప్పలుగా కాలుతున్న కరోనా రోగుల మృతదేహాలు.. అవి అయిపోగానే అంత్యక్రియల కోసం కరోనా రోగుల మృతదేహాలతో వచ్చి క్యూ కట్టిన అంబులెన్సులు.. అక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. రోజూ పదుల సంఖ్యలో కరోనా రోగుల మృతదేహాలకు అక్కడ అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు. ఇదీ, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో కరోనా విలయం ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం.

అయితే, రోజూ అన్ని మృతదేహాలకు అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. స్థానికులైతే 1984 భోపాల్ గ్యాస్ విషాదం తర్వాత ఇంతటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. నాలుగు గంటల వ్యవధిలోనే 40 నుంచి 50 వరకు మృతదేహాలకు అంతిమ సంస్కారాలను చేస్తున్నారని అంటున్నారు.

కరోనా రోగుల మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయాలంటే కనీసం మూడు గంటలైనా వేచి చూడాల్సి వస్తోందని, వారి తరఫున వచ్చిన బంధువులు చెబుతున్నారు. అయితే, ఐదు రోజులుగా ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, శ్మశానాల్లో కాలుతున్న మృతదేహాల లెక్కలకు పొంతనే ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా మరణాలు, కేసులను దాస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏప్రిల్ 8న 41 మృతదేహాలకు శ్మశానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే.. బులెటిన్ లో మాత్రం కేవలం 27 మరణాలనే చూపించారు. ఏప్రిల్ 9న 35 శవాలను కాలిస్తే.. 23 మందే చనిపోయారని వెల్లడించారు. ఏప్రిల్ 10న 56 మంది చనిపోతే.. 24, ఏప్రిల్ 11న 68 మందికి.. 24, ఏప్రిల్ 12న 59 మరణాలకు 37 మరణాలనే చూపించారు. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తామేమీ లెక్కలను దాయడం లేదని చెబుతోంది. దాచినంత మాత్రాన తమకేమీ అవార్డులు రావని ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మత్రి విశ్వాస్ సారంగ్ చెప్పారు.
COVID19
Madhya Pradesh
Covid Deaths

More Telugu News