Virat Kohli: ఇది సంపూర్ణమైన విజయం: కోహ్లీ

  • అన్ని విభాగాల్లోనూ రాణించాం
  • బ్యాటింగ్‌ లైనప్ చాలా బలంగా ఉంది
  • ఐపీఎల్‌లో ఓపెనింగ్‌ చేస్తా
kohli praises india

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా‌ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న‌ సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్‌‌ కోహ్లీ మాట్లాడుతూ.. జ‌ట్టు ఆట‌గాళ్ల తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ఇది త‌మకు సంపూర్ణమైన విజయమ‌ని చెప్పాడు. ఇంగ్లండ్ జ‌ట్టుపై  అన్ని విభాగాల్లోనూ రాణించామ‌ని తెలిపాడు.

మైదానంలో తేమ ప్రభావం అధికంగా ఉన్నప్ప‌టికీ గత మ్యాచ్‌లాగే చివ‌రి మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ బాగా రాణించామ‌ని చెప్పాడు. జ‌ట్టు ఆట‌గాళ్లు పంత్‌, శ్రేయస్‌ బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండానే ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొని  224 పరుగుల భారీ స్కోర్‌ సాధించామ‌న్నాడు. త‌మ బ్యాటింగ్‌ లైనప్ చాలా బలంగా ఉంద‌ని దీని ద్వారానే చెప్పవ‌చ్చ‌ని అన్నాడు.

త‌న‌పై రోహిత్‌కు, రోహిత్ పై త‌న‌కు‌ సానుకూల దృక్పథం ఉంద‌ని చెప్పాడు. పిచ్‌లో ఒకరు ధాటిగా ఆడితే, మరొకరు నిలకడగా ఆడాలని అనుకున్నామ‌ని తెలిపాడు.  సూర్య, హార్దిక్‌ మ్యాచ్‌లో మరింత దూకుడుగా రాణించి ముందుకు తీసుకెళ్లారని తెలిపాడు. ఐపీఎల్‌లోనూ తాను ఓపెనింగ్‌ చేస్తాన‌ని తెలిపాడు.

గతంలో వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం త‌న‌కు ఉంద‌ని అన్నాడు. ఇకపై రోహిత్‌తో కలిసి తాను కచ్చితంగా ఓపెనింగ్ చేస్తాన‌ని తెలిపాడు. త‌మ‌ ఇద్దరిలో ఎవరు నిలిచినా ఇతర బ్యాట్స్‌మెన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దీంతో జట్టుకు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని చెప్పాడు. శ్రేయస్‌ గత మ్యాచ్‌తో బాగా రాణించాడ‌ని, అలాగే తొలి మ్యాచ్‌లో బాధ్యతగా ఆడాడ‌ని కోహ్లీ అన్నాడు.


More Telugu News